హైదరాబాద్, మార్చి 15 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. జై కేసీఆర్ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకొంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ప్రాంగణంలో ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి మానవీయ కోణంలో స్పందించారని ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్, మెప్మా ఉద్యోగులకు శాననసభలో సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించడం పట్ల తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ హర్షం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ సర్కారు అంటే ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోమారు నిరూపితమైందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఉత్తమంగా పనిచేసి ప్రజలకు మంచి సేవలందించి రాష్ర్టానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకొని ఉపాధి హామీ విధుల నుంచి పంచాయతీ కార్యదర్శులకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మహేశ్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు
సెర్ప్, మెప్మా, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకోవడం, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్కు కార్మికులు, ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఉద్యోగ, కార్మిక పక్షపాతి. మానవీయ కోణంలో స్పందించే కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
– జీ రాంబాబుయాదవ్,టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ మీద మాకు మొదటి నుంచి నమ్మకం ఉన్నది. అందుకే ఇన్నాళ్లు వేచి చూశాం. కేసీఆర్ సీఎం అయ్యాక ఏనాడూ ఉద్యోగుల, కార్మికుల పొట్టకొట్టలేదు. మామీద కనికరం చూపించారు. ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కేసీఆర్ మెప్పును పొందుతాం. కేసీఆర్కు జీవితకాలం రుణ పడి ఉంటాం.
-కంకణాల సిద్దిరాజు, ప్రధాన కార్యదర్శి , టీఆర్ఎస్కేవీ అనుబంధ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్
ఉపాధి హామీ పథకంలో కొన్నేండ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి సీఎం కేసీఆర్ మానవీయత చాటారు. వారుచేసిన సేవలను ప్రభుత్వం గుర్తించడం హర్షణీయం.
– మాలమహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ