ప్రధాని రాష్ట్రంలో 24 గంటల కరెంటు రాదు. 2000 పెన్షన్ రాదు. పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకం లేదు. దోపిడీ తప్ప ఏమీ లేదు.. అక్కడి నుంచి వచ్చే గులాంగాళ్లు.. ఈ దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనిపిస్తుండ్రు. 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో ఉండాలా? లేక మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు.. గజదొంగలకు సద్దిగట్టి గులాంలం కావాలా? దయచేసి అలోచించండి.
కేంద్ర బీజేపీ నాయకులు ఇక్కడున్న బీజేపీ నాయకులను గులాంలను చేసుకొని.. బూట్లు, చెప్పులు మోపిస్తుండ్రు. చెప్పులు మోసిన వెదవలు కూడా ఎటువడితె అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసేపని చేస్తుండ్రు. ఇటువంటి దొంగలకు ప్రజలే సరైన బుద్ది చెప్పాలి” – సీఎం కేసీఆర్
ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని కలబోతల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. పెద్దపల్లిలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభావేదికగా.. సీఎం మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను.. విచ్ఛిన్నం చేసేందుకు మతం, కులం పేరిట బీజేపీ ఆడుతున్న డ్రామాలను ప్రజలకు విప్పి చెప్పారు. పనిలో పనిగా.. చెప్పులు మోసే గులాంలు కారుకూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకోవైపు.. మోటర్లకు మీటర్లు రాకుండా ఉండాలన్నా దేశ ప్రతిష్ట పెరగాలన్నా. కులమతాల చిచ్చు అనే మంటలు రేగకుండా ఉండాలంటే బీజేపీ ముక్త్ భారత్కు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తున్న తీరుపై ఉక్కు పిడికిలి బిగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. సభికుల హర్షధ్వానాల మధ్య జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిందేనంటూ సంకేతమిచ్చారు.
పెద్దపల్లి: కలెక్టరేట్ ఎదుట గుమ్మడి కాయతో దిష్టి తీస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి, తదితరులు
కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : పెద్దపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజశైలిలో పదునైన మాటలతో.. ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. 16 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అన్ని విషయాలను ప్రజలకు విప్పిచెప్పారు. తాజాగా, 26 రాష్ర్టాల నుంచి వచ్చిన రైతు నాయకులు.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై చెప్పిన అభిప్రాయాలను ప్రజల ముందు పెట్టారు. ఇదే సమయంలో.. “రైతు నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. మరి మనం పోదామా.. జాతీయ రాజకీయాల్లోకి” అంటూ ప్రశ్నించినప్పుడు సభికులంతా ఏకతాటిపైకి వచ్చి వివిధ రూపాల్లో కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. మీరు వెళ్లండి మేముంటామన్న సంకేతాన్ని ఇచ్చారు. “దేశాన్ని దోచుకుంటున్న కేంద్ర బీజేపీ నాయకులు ఇక్కడున్న బీజేపీ నాయకులను గులాంలను చేసుకొని.. బూట్లు, చెప్పులు మోపిస్తుండ్రు. చెప్పులు మోసిన వెదవలు కూడా ఎటువడితె అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసేపని చేస్తుండ్రు. ఇటువంటి దొంగలకు ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి” అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సమయంలో.. సభ నుంచి జై కేసీఆర్ అంటూ నినదించారు. “ప్రధాని రాష్ట్రంలో 24 గంటల కరెంటు రాదు.. 2000ల పెన్షన్ రాదు. పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకం లేదు. ఏమీ లేదు దోపిడీ తప్ప.. అక్కడి నుంచి వచ్చే గులాంగాళ్లు.. ఈ దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనపడుతున్నారు తెలంగాణలో.. 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో ఉండాలా..? లేక మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లు, గజదొంగలకు సద్దిగట్టి గులాంలం అవుదామా.. దయచేసి ఆలోచన చేయండి.” అంటూ విజ్ఞప్తి చేసినప్పుడు.. ఆత్మగౌరవం కాపాడుకుందామంటూ ప్రజలనుంచి నినాదాలు వచ్చాయి. “మోసపోతే గోసపడుతం. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కిపోతం. మీ బిడ్డగా నేను ఒక్కటే చెబుతున్న.. తెలంగాణ బాగుపడే సమయంలో లంచగొండులు, లక్షల కోట్ల ఖజానాను దోచుకునే దొంగలు వచ్చి.. మతం పేరు మీద కొట్లాడుండ్రి అని విద్వేషాలు, విధ్వంసాలు సృష్టిస్తుండ్రు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పారేటి స్వచ్ఛమైన నీళ్లు కావాలా.. మత కలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా..” అంటూ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచించేలా చేసింది.
ప్రధానంగా రైతులకు ఉచిత కరెంటుపై కేంద్రం పెడుతున్న కొర్రీల విషయంలో అంకెలతో సహా ప్రజల ముందు పెట్టారు. దేశం మొత్తంలో వ్యవసాయానికి వాడుతున్న కరెంటు 20.8 శాతం మాత్రమేనని, దీనికి అయ్యే వ్యయం కేవలం రూ.1.45 లక్షల కోట్లు మాత్రమేనని, ఇది ఒక కార్పొరేట్ కంపెనీకి దోచిపెట్టినంత కాదని రైతులకు అర్థమయ్యేలా వివరించి చెప్పారు. “మీటర్లు పెట్టాలంటూ వెంటపడుతున్న నరేంద్ర మోదీకి మనమంతా కలిసి మీటర్ పెట్టాలి” అంటూ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు.. సభలో చప్పట్లు మారుమోగాయి. కుట్రలు, కుతంత్రాలే కాదు.. కుల మతాల పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీ తీరుపై గ్రామాల్లో చర్చపెట్టాలని పిలుపునిచ్చారు. మేధావులు, బుద్ధిజీవులు.. యువకులు మేల్కొని ప్రతి గ్రామంలో చర్చ పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మత పిచ్చిగాళ్లు, ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ముందుకు వెళ్లాలని సూచించారు. మౌనం శాపం అవుతుందని సీఎం హెచ్చరించారు.
సింగరేణి పిడికిలెత్తాలి..
“తలాపున పారుతుంది గోదావరి.. నా చేనూ చెలుక ఎడారి.. అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి.. మూర్మూరు గ్రామానికి చెందిన కవి సదాశివ ఈ పాట రాశారు. ఉద్యమ సమయంలో చైనత్యం నింపిన ఈ గడ్డ.. అదే చైతన్యంతో సింగరేణి కార్మికలోకం కన్నెర్రజేసి పిడికిలి ఎత్తాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యలతో జరుగుతున్న మేలు కార్మికుల ముందు ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని, అందుకే పిడికిలి ఎత్తాలని పిలుపునిస్తున్నట్లు వివరించి చెప్పారు. “నిజంగా తెలంగాణ రాకపోయి ఉంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం అయి ఉండేదా.. రామగుండంలో మెడికల్ కళాశాల వచ్చేదా.. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు అయ్యేవా? ఒక్కసారి ఆలోచించాలి” అంటూ సూచించారు. “మనం ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే.. దీనిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంది. అటువంటి బీజేపీని అందరం కలిసి ప్రతిజ్ఞ పూని.. 2024లో బీజేపీ ముక్త్భారత్.. బీజేపీ లేని భారత దేశాన్ని సృష్టించడానికి సన్నద్ధం కావాలి” అని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కోరుట్ల, చొప్పదండి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్రావు, ఎల్ రమణ, పాడి కౌశిక్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, టీఎస్ఐపాస్ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్మన్లు పుట్ట మధూకర్, కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్పర్సన్లు దాసరి మమతారెడ్డి, పుట్ట శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గెల్లు శ్రీనివాస్యాదవ్, నల్ల మనోహర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.