హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతిచెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం ఆదేశించారు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లా కమలాపురలో గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును మినీ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కలబురిగిలోని మూడు దవాఖానలకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, బాధితులు అంతా బొల్లారంలోని రిసాలాబజార్కు చెందినవారు.