హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని సీఎం కేసీఆర్ అన్నారు. పదికాలాల పాటు నిలిచివుండే సెక్రటేరియట్ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం గురువారం పరిశీలించారు. సచివాలయ నిర్మాణంలో సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.
అనంతరం ప్రగతి భవన్లో సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతికాలంలోనే అభివృద్ది, సంక్షేమరంగాల్లో దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలన్నారు. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలవాలన్నారు. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేయాలన్నారు.
పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న మాదిరి ధోల్ పూర్ స్టోన్ తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించాలన్నారు. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రోడ్లు భవనాలశాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.