హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): యువత జీవితాలను మత్తులో ముంచి చిత్తుచేస్తున్న గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం గంజాయి కంపు కొడుతున్నది. మనరాష్ట్రంలో గంజాయి మూలాలను వెతికి పెకిలించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నా లు చేస్తుంటే, ఏపీలో నేతలు గంజాయి అంశాన్ని రాజకీయాలకు వాడుకొంటూ ముష్టియుద్ధానికి దిగుతున్నారు. తెలంగాణ పోలీసులు ఏపీలోని గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేస్తుంటే, ఏపీలో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రజల ఆరోగ్యాన్ని నేతలు గాలికి వదిలేస్తున్నారని అక్కడి వారు మండిపడుతున్నారు.
గంజాయి పీడతో తలెత్తే దుష్పరిణామాలను ముందుగానే గుర్తించిన సీఎం కేసీఆర్ వెనువెంటనే పోలీస్, ఎక్సైజ్శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి గంజాయి విక్రేతలు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాల తనిఖీలు ముమ్మరమయ్యాయి. మొగ్గ దశలోనే మాదకద్రవ్యాలను తుదముట్టించే వ్యూహంతో అతివేగంగా కార్యచరణ అమలు చేస్తున్నారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నా యి. వాస్తవానికి గంజాయి సాగు అవుతున్నదే ఏపీనుంచే మన రాష్ర్టానికి, ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ర్టాలకు రవాణా అవుతున్నది. దాని మూలాలను దెబ్బతీయాల్సిన ఏపీలో రాజకీయ విమర్శలతో పొద్దు గడుపుతున్నారని ఆ రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. గంజాయిపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తన్నుకొన్న రోజే తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైభవంగా జరుగుతున్న యాదాద్రి నిర్మాణ పనుల పరిశీలన దృశ్యాలు అన్ని టీవీ చానళ్లలో పక్కపక్కనే ప్రసారమయ్యాయి. ఒకవైపు తన్నులాటలు, మరోవైపు ఆధ్యాత్మిక శోభకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం కావటంతో సోషల్మీడియాలో నెటిజన్లు తెలంగాణను పొగుడుతూ, ఏపీలో పరిస్థితికి విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. తెలంగాణ సీఎం రివ్యూ సమావేశం పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని స్పష్టంగా చెప్పారని, ఏపీలో మాత్రం అలాంటి సమీక్షలు లేవని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు శుక్రవారం మంగళగిరిలోని ఓ సమావేశంలో చెప్పడం గమనార్హం.