హైదరాబాద్ : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పథకం అమలును నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. యాదాద్రిలో పునః నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ పరిధిని అతిక్రమించినట్లు కనిపిస్తుందన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పథకమన్నారు. గతంలో ఏం చెప్పినా.. ఏ విధంగా సాధించి చూపెట్టామో అందరికీ తెలుసని.. హుజూరాబాద్ నియోజకవర్గం కావచ్చు.. రాష్ట్రంలోని దళితబిడ్డాలకు తాను చెప్పేది ఒక్కటేనని.. తాను ఏం చేపట్టినా విజయతీరాలకు చేర్చిన తప్ప.. వెనక్కి వెళ్లలేదన్నారు. మంచి, చెడు ఆలోచించే పథకం తీసుకువచ్చామన్నారు.
పథకం అమలును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు చిన్న అడ్డంకి మాత్రమేనని చెప్పారు. హుజూరాబాద్ బై పోల్ తర్వాత దళితబంధు ఆపేదెవరని ఆయన ప్రశ్నించారు. నవంబర్ నాలుగు నుంచి స్వయంగా నేనే దళిత బంధు పథకాన్ని పంపిణీ చేస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగానూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. దళితులను ఆర్థికంగా పటిష్టంగా తయారు చేయటమే తన లక్ష్యమన్నారు. పథకం నిర్విఘ్నంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.