హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఇప్పటికి నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయని పేర్కొన్నారు. ప్రజలతో, పార్టీ క్యాడర్తో మమేకమయ్యేవారికి ఎప్పుడూ ఢోకా ఉండదని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో ఆయన అనేక అంశాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
‘మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చటం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు కదా! తప్పదంటే ఓ నాలుగైదు మార్చాల్సి వస్తదేమో.. ఈ టైంల అన్నీ సరిచేసుకోవాలి. జాగ్రత్తగా నడుచుకోవాలి’ అని ఆయన ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు తెలిసింది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పార్టీ క్యాడర్తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారని సమాచారం.
మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ విధానమని, అయితే ఆ విషయాలను ఎక్కువ ఆలోచించకుండా విశాల ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్నామనే స్పృహతో వ్యవహరించాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకర్గ భౌగోళిక, సామాజిక స్వరూపంపై, ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి మనసుల్లో ‘మనం మాత్రమే’ చేయగలిగాం అని ముద్రపడేలా ఒకటికి పదిసార్లు చెప్పాలని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. అవసరమైతే పథకాల వారీగా లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేయాలని చెప్పారని తెలిసింది.
నేతలు, క్యాడర్తో వనభోజనాలు
నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతోపాటు పార్టీలోని అన్నిస్థాయిల క్యాడర్తో ఎమ్మెల్యే నిత్యం టచ్లో ఉండాలని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందర్నీ విధిగా భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదేనని చెప్పారని తెలిసింది. పార్టీ క్యాడర్ను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేలా వ్యవహరించాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ‘పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నాం. అయినా మాకు ఎమ్మెల్యే గుర్తింపు ఇవ్వటం లేదు’ అనే భావన క్యాడర్లో రావద్దన్న సీఎం.. మనం వాళ్లకు ఏం చేసినా చేయకపోయినా సరే దగ్గరికి పిలిచి మాట్లాడితే వారు సంతోషపడతారనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని పేర్కొన్నట్టు తెలిసింది. నెలా, నెల 15 రోజుల్లోగా ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవర్గాల్లో వనభోజనాలు పూర్తి చేయాలని నిర్దేశించినట్టు తెలిసింది.
దళితబంధులో జీవించాలి
దళితబంధులో ఎమ్మెల్యేలు జీవించాలని కేసీఆర్ అన్నారు. ‘అప్పుడెప్పుడో ఇందిరాగాం ధీ దళితులకు ఇండ్లు కట్టిస్తే యావత్ దళిత జాతి దశాబ్దాలపాటు కాంగ్రెస్ను కండ్లకు అద్దుకున్నది. మనం ప్రవేశపెట్టిన దళితబంధు సామాన్యమైన కాదు. యావత్ దేశమే ఆశ్చర్యపోతున్నది’ అని చెప్పారు. ఇటీవల 26 రాష్ర్టాల నుం చి తెలంగాణకు వచ్చిన రైతు నేతల్లో కొందరు దళితులు ఉన్నారని, వారికి దళితబంధు గురిం చి చెబితే అబ్బురపడ్డారని, పథకం లబ్ధిదారులను కలిశారని సీఎం తెలిపారు. ‘మా రాష్ర్టాల్లో కనీసం మేము పెండ్లి ఊరేగింపు కూడా చేసుకోలేని పరిస్థితులున్నాయి. అటువంటిది మీరు దళిత జాతి సముద్ధరణకు కృషి చేస్తున్నారు’ అని కండ్ల నీళ్లు పెట్టుకున్నారని ఆయన వివరించినట్టు తెలిసింది.
వారం పదిరోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ‘దళిత్ సమ్మేళన్’కు మీరే నాయకత్వం వహించాలని తనను కోరారని వివరించారు. ‘ఎమ్మెల్యేలు దళితవాడలకు వెళ్లాలి. వారితో కలిసి భోజనం చేయాలి. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలి’ అని సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి త్వరలో 500 కుటుంబాలకు దళితబంధు అమలు చేయనున్నామని, ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని కేసీఆర్ సూచించారని తెలిసింది. ఇండ్లులేని సొంత జాగ ఉన్నవారిని సాధ్యమైనంత తొందరలోనే గుర్తించాలని, తొలి దశలో 2 నుం చి 3 వేల మంది అర్హులను గుర్తించాలని, వీరికి రూ.3 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి త్వర లో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నట్టు సమాచారం.
ఈడీ.. బోడీలకు బెదిరేది లేదు..
కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నదని కేసీఆర్ ఆగ్రహించినట్టు సమాచారం. ‘ఈడీలు.. బోడీలు ఏం చేసుకుంటాయో చేసుకోమని ఇప్పటికే చెప్పినం. మళ్ల చెప్తున్నం. ప్రజలను గందరగోళానికి గురిచేసి, రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నది. అదే క్రమంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ది. దాన్ని పనిగా పెట్టుకున్నది. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎక్కువ ఆలోచిస్తే టైంవేస్ట్’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం.
ఎంతమంది కేంద్రమంత్రులు అవుతారో..!
బీజేపీ అరాచక పాలనను చూసి దేశం ఛీ కొడుతున్నదని, ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లో మనం క్రియాశీల పాత్ర పోషించబోతున్నామని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు చెప్పినట్టు సమాచారం. 2001లో టీఆర్ఎస్ పెట్టినపుడు ‘మీలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు’ అని చెబితే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడేమైంది? రేపు మీలో చాలా మంది కేంద్ర మంత్రులు.. గవర్నర్లు.. అంబాసిడర్లు అవుతారు’ అని కేసీఆర్ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నట్టు తెలిసింది.
పండుగలా జాతీయ సమైక్యతా ఉత్సవాలు
16 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 10-12 వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీవోలతో కలిసి ర్యాలీలు నిర్వహించాలని, వారందరికీ భోజనాలు పెట్టాలని చెప్పారు.
మునుగోడు గెలిచేది వందశాతం మనమే
‘మునుగోడులో గెలిచేది వంద శాతం మనమే. ఇందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు’ అని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులను మునుగోడులోని రెండేసి గ్రామాలకు పంపి, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించినట్టు సమాచారం.
పోడుభూముల సమస్యపై ఉమ్మడి కార్యాచరణ
పోడు భూముల సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారని తెలిసింది. ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉన్నదని, దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ప్రాజెక్ట్ అధికారి, ఫారెస్ట్ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి గ్రామాల వారీగా అటవీభూమి ఎంత ఆక్రమణకు గురైంది? ఎంతమంది అర్హులున్నారు? అందులో వాస్తవమెంత అనే విషయాలను క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.