హైదరాబాద్ : రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతంగా వున్నాయి. కానీ.. కేంద్రంలో మాత్రం పరిస్థితులు బాగో లేవు. కొంత గడబిడ వుంది. అక్కడ కొంత రోగం వుంది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. ఇఫ్తార్ విందు సందర్బంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఇఫ్తార్ విందుకు హాజరైన ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలందరికీ నమస్కారం. గత కొన్నేళ్ల క్రితం తెలంగాణ వాతావరణం చాలా ఇబ్బందిగా వుండేది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. వ్యవసాయానికి కూడా ఇవ్వడానికి నీళ్లు లేవు. కానీ.. మీ అందరి సహకారం వల్ల పరిస్థితి మారిపోయిందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. భారత దేశం మొత్తం నేడు అంధకారంలో వుంది. కానీ తెలంగాణ మాత్రం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. తాగేనీరు గానీ, వ్యవసాయం గానీ, పండే పంటలో కూడా తెలంగాణ మంచి ఫలితాలను సాధించింది. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించాం. అన్ని వసతులూ కల్పించాం. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీరుగానే.. దేశం మొత్తం కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ఇంత అభివృద్ది పథంలో వున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఓ నిర్మాణాత్మక అభివృద్ధి పథంలో తెలంగాణ పయనిస్తున్నందుకు ఎంతో గర్వంగా వుంది. నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నందుకు ఆనందంగా వుంది. దేశం మొత్తంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతినొందింది. ప్రతి రంగానికీ నాణ్యమైన విద్యుత్నే అందిస్తున్నాం. ఇది ఏమాత్రం సరిపోదు. ఇంకా అభివృద్ధి సాధించాల్సి వుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని కేసీఆర్ ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతంగా వున్నాయి. కానీ.. కేంద్రంలో మాత్రం పరిస్థితులు బాగో లేవు. కొంత గడబిడ వుంది. అక్కడ కొంత రోగం వుంది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం మాత్రం వుందన్నారు కేసీఆర్. తెలంగాణ కూడా దేశంలో భాగమే. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. 2014 లో రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు పెరిగింది. మన తలసరి ఆదాయంలో సగం కూడా దేశానిది లేదు. కేంద్రం బలహీనంగా వుంటే రాష్ట్రం కూడా బలహీనంగానే వుంటుంది. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ వుంటే కచ్చితంగా దానిని ఆపాలి. దానిని గాడిలో పెట్టాలి. అది మన బాధ్యత. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పాలుకానివ్వదు. నాకు పూర్తి విశ్వాసం వుంది. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే దానిని అధిగమించే శక్తి ఆ దేవుడు ఇస్తాడు. అలాంటి విపత్కర పరిస్థితుల వరకూ తీసుకెళ్లడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేనినైనా కూల్చడం చాలా సులభం. నిర్మించడమే చాలా కష్టం. బెంగళూరులో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దేశమంతా ఇలాగే నడుస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలకు కూడా ఇది అర్థమవుతోంది. దీనిని బాగు చేయాల్సిన అవసరం వుందన్నారు సీఎం.
దేవుడు తెలంగాణను ఎలాగైతే అభివృద్ది పథంలో నడిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చారో.. దేశం వైపు కూడా మమ్మల్ని అలాగే నడిపిస్తారన్న నమ్మకం వుందని కేసీఆర్ తెలిపారు. అందులో అనుమానమే లేదు. మనకు కూడా ఈ దేశం కోసం పనిచేసే ఛాన్స్ వస్తుందన్నారు సీఎం.
మీ అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. కేవలం తెలంగాణ ముస్లిం ప్రజలకే కాకుండా దేశంలోని ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. చివరగా మీ అందరికీ ఒకే విన్నపం. దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కొన్ని రోజుల పాటు వారిదే పై చేయి అయినట్లు కనిపిస్తుంది. కానీ… చివరికి మానవత్వమే గెలుస్తుంది. మానవత్వం ఎప్పుడూ నశించదు. ఆ మానవత్వం పునాదుల మీద ఒకరినొకరు సహాయం చేసుకుంటూనే వుంటారు. సుహృద్భావ, ప్రేమపూర్వక జీవనం అందరికీ లభిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.