కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి భరోసానిచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ సమీపంలోని దత్తోజీపేట వద్ద ఉన్న హెలీప్యాడ్కు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాంచంద్రాపూర్ మీదుగా లక్ష్మీపూర్కు వెళ్లారు. రైతు ద్యావ రాంచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని, మస్క్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. తీపిదోస ఎన్నాళుగా సాగు చేస్తున్నారు? గతంలో ఎన్ని ఎకరాలు సాగు చేశారు? అని రైతు రాంచంద్రారెడ్డిని సీఎం అడిగారు. దీనికి ఆ రైతు సమాధానమిస్తూ గతంలో ఐదెకరాల్లో మాత్రమే తీపిదోస సాగు చేశానని, ప్రస్తుతం గాయత్రీ పంపుహౌస్ గ్రావిటీ కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు వస్తుండడంతో ఈసారి పదెకరాల్లో మస్క్మిలన్ సాగు చేశానని సమాధానమిచ్చారు.
అనంతరం సమీపంలోని గుండి గ్రామానికి చెందిన బండారి శంకర్ వరి పొలాన్ని పరిశీలించారు. అనంతరం రైతు రాంచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉద్యానవనశాఖ ఏర్పాటు చేసిన దెబ్బతిన్న పంటల ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వివరించారు. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు, రైతుల బాధలను తెలియజేశారు. ఇక్కడ చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన పలువురు రైతులతో సీఎం మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా గుండి శివారులో రైతు ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటను పరిశీలించారు. వడగండ్లకు దెబ్బతిన్న చెట్లను చూశారు. ఇక్కడ కౌలురైతు తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని, పంటనష్టంతో అప్పులపాలయ్యానని సీఎం తెలుపగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు సూచిస్తూ బాధిత కౌలు రైతుకు బెడ్రూం మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయాచోట్ల రైతుల ఆవేదనను పూర్తిగా విన్న సీఎం కేసీఆర్, రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. నాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలు, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయని వివరించారు. తెలంగాణలో విస్తరించిన సాగు విస్తీర్ణం, దేశ పరిస్థితులు, కేంద్రంలో సాగుతున్న కుట్రలు, వ్యవసాయ రంగంపై కేంద్రం చిన్నచూపు, పంటల నష్టపరిహారం చెల్లింపులోనూ వివక్ష వంటి విషయాలను అర్థమయ్యేలా చెప్పారు.
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులెవ్వరూ ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘మీ వెంట నేనున్నా. మీరు వ్యవసాయంలో వెనుకపడొద్దు’ అన్న సందేశాన్ని ఇచ్చారు. చివరగా రామడుగు శివారులోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఆయన అభయమివ్వగా, సీఎం కేసీఆర్ మాటలు తమలో ధైర్యం నింపాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాలాభిషేకాలు చేశారు. అంతేకాదు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని బిక్కబిక్కుమంటున్న తమకు పరిహారం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అండగా నిలిచారని చెప్పారు. పరిహారం వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఉన్న తమకు రైతు బాంధవుడి మాటలు భరోసానిచ్చాయన్నారు.
సీఎం పర్యటనలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఆర్బీఎస్ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టెసాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు, తదితరులు ఉన్నారు.
వడగండ్ల ముప్పు ముగియలేదు
వడగండ్ల ఉపద్రవం ఇంకా తొలిగిపోలేదు. ఇంకో రెండు మూడు సార్లు వడగండ్లు పడే ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఇంకా కొంత నష్టం జరగవచ్చు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఎక్కడా లేనన్ని వసతులు తెలంగాణ రైతాంగానికి చేకూర్చి, వాళ్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నం. వ్యవసాయాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగాం. రాష్ట్ర జీడీపీ కూడా బాగా పెరుగుతోంది. ప్రజలకు పనులు దొరుకుతున్నాయి. ఆదాయం పెరుగుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వెనక్కు పోనియ్యవద్దనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. మీ వెంట నేను, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటది. ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా రైతులు ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసుకోవద్దు. ఇంకా బలంగా పని చేస్తూ ముందుకు పోవాలి.
కౌలు రైతులు దిగులు వద్దు
అక్కడక్కడ కొద్ది మంది కౌలు రైతులు కూడా ఉన్నరు. వాళ్లు మొత్తమే మునిగిపోయే ప్రమాదం ఉన్నందున వాళ్లకు కూడా పరిహారం చెందేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇస్తున్నం. కౌలు రైతులు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్లను కూడా అన్ని విధాలా ఆదుకుంటం.
– సీఎం కేసీఆర్
పరిహారం కేంద్రాన్ని అడగదల్చుకోలేదు
కేంద్రంలో చదువు లేని సన్నాసులు రాజ్యమేలుతున్నరు. రైతుల బాధలు వాళ్లకు చెప్పినా అర్థం కావు. సమస్యను అర్థం చేసుకునే సంస్కారం కూడా వాళ్లకు లేదు. ఇప్పటికీ రెండు మూడు సార్లు నష్ట పరిహారం కోసం నివేదికలు పంపించినా ఏకాన ఇచ్చింది లేదు. హైదరాబాద్లో వరదలు వస్తే కూడా పరిహారం ఇవ్వలేదు. అందుకే పరిహారం విషయంలో కేంద్రాన్ని అడుగదల్చుకోలేదు. భగవంతుడి దయవల్ల రాష్ట్ర ఎకానమీ పెరిగింది. రైతులను ఆదుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద మొత్తంలో పరిహారం ప్రకటించాం.
– సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
చొప్పదండి/ గంగాధర, మార్చి 23 : వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైతులు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు ఉన్నతంగా బతకాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతులకు నష్టం రానివ్వడని ఎమ్మెల్యే కొనియాడారు. పెద్దపల్లి పట్టణం, కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని కొలిమికుంటలోని రైతు క్షేత్రం, గంగాధర మండలం మధురానగర్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.