తాడేపల్లి : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడాన్ని ఏపీ సీఎం జగన్ సమర్ధించుకున్నారు. అన్నీ ఆలోచించాకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ సవరణ బిల్లును ఏపీ ఆరోగ్య మంత్రి విడుదల రజని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరణ బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపి టేబుల్పైకి విసిరికొట్టారు. అనంతరం వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకుముందు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు పలకడం చంద్రబాబుకు సుతారమూ ఇష్టం ఉండదని చెప్పిన జగన్.. తాను మాత్రం ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబు కంటే ఎక్కువ గౌరవం ఎన్టీఆర్కు ఇస్తానని తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎక్కువ కాలం ఆయనే సీఎంగా ఉండేవారని, చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదన్నారు. ఎందరినో ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేకపోయారని ప్రశ్నించారు.
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడానికి ముందు బాగా ఆలోచించానని జగన్ చెప్పారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి డాక్టర్గా మంచిపేరు తెచ్చుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారని, పథకాల సృష్టికర్త అనగానే వైఎస్సార్ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. టీడీపీ ఏర్పాటుకాక ముందు ఏపీలో 8 వైద్య కళాశాలలు ఉండేవని, వైఎస్సార్ మరో 3 కాలేజీలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. వీటికి తోడుగా మరో 17 కాలేజీలను ప్రారంభించామని తెలిపారు. ఒక్క మెడికల్ కాలేజీ పెట్టని టీడీపీకి.. విశ్వవిద్యాలయానికి ఒక వ్యక్తి పేరు పెట్టే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు.