తాడేపల్లి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో పశువుల ఆసుపత్రులు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ వంటి వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు.
పురుగుమందులు, రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల వివిధ రూపాల్లో జంతువుల దాణాలోకి ప్రవేశించి అక్కడి నుంచి పాలలో వాటి అవశేషాలు బయటపడుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. అందువల్ల స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాలు, గుడ్లు తినడం వల్ల చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని, అయితే అదే పాలలో రసాయనాల అవశేషాల వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయన్నారు. పశుసంవర్ధక శాఖలోని అసిస్టెంట్ పోస్టుల భర్తీని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, పశుసంవర్ధక విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.
రైతులకు ప్రత్నామ్నాయం ఆదాయం పొందేందుకు పశుపోషణ చేపట్టాలని సూచించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మండలం ఒక యూనిట్గా తీసుకుని ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలుచేయాలన్నారు. వచ్చే నెలలో మరిన్ని పశు అంబులెన్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధకశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.