132 ఏండ్లపాటు సైన్యానికి సేవలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సైనికులకు శ్రేష్ఠమైన ఆవు పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 132 ఏండ్ల కిందట ప్రారంభించిన మిలిటరీ డెయిరీఫాంలు చివరికి మూతపడ్డాయి. వాటిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని రక్షణ శాఖలో ఇతర విభాగాలకు బదలాయించారు. బ్రిటిష్ కాలం నుంచే సైనిక స్థావరాలకు సమీపంలో ఈ డెయిరీలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. మొదటి డెయిరీఫాంను 1819లో అలహాబాద్లో నెలకొల్పారు. స్వాతంత్య్రం వచ్చాక అవి మరింత వృద్ధి చెందాయి. 1990ల్లో లేహ్, కార్గిల్లో కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 130 డెయిరీల్లో ఆవులు, బర్రెల సంఖ్య 30 వేలకు చేరింది. ఇవి దశాబ్దాలుగా కోట్ల లీటర్ల పాలను నిరంతరాయంగా సరఫరా చేశాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు దూరంగా కంటోన్మెంట్లు ఉండేవి. అందువల్ల పాల కోసం డెయిరీఫాంలు అవసరమయ్యాయి. కాలక్రమేణా పట్టణాలు విస్తరించాయి. కంటోన్మెంట్లు కూడా పట్టణాలు, నగరాల పరిధిలోకి వచ్చాయి. దీంతో సైనికులకు అవసరమయ్యే పాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించడం ప్రారంభించారు. మరోవైపు చాలా ఏండ్లుగా ఈ డెయిరీల నిర్వహణలో అవినీతి చోటుచేసుకుంటున్నదన్న ఆరోపణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డెయిరీఫాంలను మూసివేయాలని 2012, 2016లో రెండు ఉన్నతస్థాయి కమిటీలు సిఫారసు చేశాయి.