న్యూఢిల్లీ : కొత్తగా పుట్టుకు వస్తున్న కరోనా కొత్త వేరియంట్లతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బూస్టర్ డోస్పై చర్చ తీవ్రంగానే సాగుతున్నది. ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు టీకా పంపిణీ చేస్తుండగా.. భారత్లో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. బూస్టర్ డోస్పై శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో బూస్టర్ డోస్పై క్లినికల్ స్టడీ ప్రారంభమైంది. ఇందు కోసం సంస్థ మూడు నుంచి ఆరు నెలల కిందట కొవాగ్జిన్ రెండు మోతాదుల టీకా తీసుకున్న వలంటీర్లు అవసరం. కాగా, ఇన్స్టిట్యూట్ కొవాగ్జిన్ తీసుకున్న వారు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో అధ్యయనం ఆలస్యమవుతున్నది.
వ్యాక్సినేషన్లో కొవిషీల్డ్దే 88శాతం వాటా
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. భారత్లో కొవిడ్కు వ్యతిరేకంగా అందిస్తున్న వ్యాక్సిన్లలో 88శాతం వాటా కొవిషీల్డ్దే. అయితే, కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యయనం కోసం వలంటీర్ల ఎంపికకు ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. కొవాగ్జిన్ తీసుకున్న వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నరు. క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్లు అవసరమంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. మూడు నుంచి ఆరు నెలల కిందట రెండో డోసు కొవాగ్జిన్ టీకా తీసుకున్న వ్యక్తుల బూస్టర్ డోస్పై జరిగే అధ్యయనంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపింది.
వలంటీర్లు దొరక్క ఇబ్బందులు
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఆగస్ట్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) వేలూరు సీఎంసీకి అనుమతి ఇచ్చింది. కొవిషీల్డ్ రెండు మోతాదులు తీసుకున్న 200 మంది వలంటీర్ల నియామకం పూర్తి చేయగా.. కొవాగ్జిన్పై అధ్యయనం కోసం వలంటీర్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్లో పాల్గొనే వారికి మూడో డోసు ఇవ్వనున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ట్రయల్స్ డేటాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
అధ్యయనంలో పాల్గొనే వారిలో బూస్టర్ మోతాదు తర్వాత ఎంత మేరకు యాంటీబాడీలు, టీ సెల్స్ ప్రతి స్పందనను పరిశీలించనున్నారు. సీఎంసీ వేలూరు సదరు టీకా కంపెనీలే అధ్యయనానికి నిధులు సమకూర్చనున్నాయి. కంపెనీలు సైతం పరిశోధనలకు సహకారం అందిస్తున్నాయి. ట్రయల్స్ కోసం బ్యాచ్ టీకాలు సైతం అందుబాటులో ఉంచినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.