న్యూఢిల్లీ : వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కింద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ (CAFMD) డైలాగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం ముందు నుంచే పని చేస్తోందన్నారు. భారత్, యూఎస్ మధ్య భాగస్వామ్యం వాతావరణ చర్యలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని యాదవ్ అన్నారు.
ఇవాళ ప్రారంభించిన ఎజెండా 2030 భాగస్వామ్యానికి సంబంధించిన క్లైమేట్ యాక్షన్, ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్, ఫైనాన్సింగ్ అంశాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పులపై సహకారాన్ని పునరుద్ధరించడానికి రెండు దేశాలకు అవకాశాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. గ్లోబల్ క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఇప్పటికే భారతదేశం గమ్యస్థానమని అన్నారు. కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్ ప్రతినిధి జాన్ ఎఫ్ కెర్రీ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, మరిన్ని విపత్కర పరిణామాలను నివారించేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, రికార్డు స్థాయిలో వర్షపాతం ప్రతిచోటా జరుగుతుందన్నారు.
పునరుత్పాదక శక్తి మునుపెన్నడూ లేని విధంగా చౌకగా ఉంటుంది. పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ కోసం తరలి వస్తున్నారన్నారు. క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని భారతదేశం, యూఎస్కు ప్రధాన అవకాశంగా పేర్కొన్న కెర్రీ, భవిష్యత్తులో కంటే ఇప్పుడు వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇండియా-యూఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ప్రారంభించారు.