న్యూయార్క్, ఏప్రిల్ 29: వాతావరణ మార్పులు, భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జంతువులు వాటి నివాసాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చి మనుషులకు దగ్గరగా వాటి ఆవాసాలను ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దీనివల్ల వైరస్ వంటి సూక్ష్మజీవులు మనుషులకు సోకడం ద్వారా మరో మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో వ్యాధులు ప్రబలేందుకు వాతావరణ మార్పులు ప్రధాన కారణం అవుతాయని నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. ‘సార్స్ వైరస్ గబ్బిలాల నుంచి సోకినట్లు మార్కెట్లకు తీసుకొచ్చే జంతువుల ద్వారా కూడా మరో రకమైన మహమ్మారి ప్రబలే ప్రమాదం ఉంది’ అని జార్జ్టౌన్ యూనివర్సిటీ పరిశోధకుడు కొలిన్ కార్ల్సన్ వివరించారు.