పాట్నా: ఒక పరీక్షా కేంద్రంలోని విద్యార్థులు కారు హెడ్ లైట్ల కాంతిలో 12వ తరగతి పరీక్ష రాశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ (12వ తరగతి) తుది పరీక్షలను బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీఎస్ఈబీ) నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. అయితే మోతీహరి పట్టణంలోని మహారాజా హరేంద్ర కిషోర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కొందరు విద్యార్థులు కారు హెడ్ లైట్ల వెలుతురులో పరీక్ష రాశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, బీహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయంపై గురువారం స్పందించారు. ఆ కేంద్రంలోని పరీక్షా సమయంలో ప్రత్యేక పరిస్థితి నెలకొన్నదని ఆయన చెప్పారు. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేసినట్లు మీడియాతో ఆయన అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై అధికారులు కూడా వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఆ కేంద్రంలో 12వ తరగతి పరీక్ష మధ్యాహ్నం 1.45కి ప్రారంభం కావాల్సి ఉన్నదని తెలిపారు. అయితే స్థానిక ఏర్పాట్లలో లోపం వల్ల సాయంత్రం 4.30కి ఆ పరీక్ష ప్రారంభమైందని చెప్పారు. దీంతో కొంత సమయం తర్వాత చీకటి పడటం, అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కారు హెడ్ లైట్ల వెలుతురులో పరీక్షను విద్యార్థులు కొనసాగించినట్లు వివరించారు.
కాగా, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తూర్పు చంపారన్ జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ కేంద్రంలో ఎందువల్ల పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందో అన్నది పరిశీలిస్తున్నామని అన్నారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
#WATCH | Students took their Class 12 exam in the light of car headlights at an exam centre in Motihari, Bihar on Tuesday evening pic.twitter.com/67hiEHD2Tx
— ANI (@ANI) February 3, 2022