మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కూడా ఆయన తెలుగు భాషను మరువకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ నటుడు కావడం వల్ల సులువుగా అధికారంలోకి వచ్చారని చాలామంది అనుకుంటారని.. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయని చెప్పారు. అందులో సందేహం లేదంటునే.. తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఊరూరా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్ఛరణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు.
ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్ సబ్టైటిల్స్ పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అందుకే తెలుగు భాషకు కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని సూచించారు. ఇకనైనా మేల్కొని దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఇంగ్లీష్ కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. చైనా, జపాన్లు పరాయి భాషల మోజులో పడలేదని తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని గుర్తు చేశారు.