ఇందూరు/విద్యానగర్, జూలై 26 : యువతీ యువకులు స్వచ్ఛందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫారం నంబర్ -8 లో కొన్ని మార్పులు జరిగాయని చెప్పారు. నియోజకవర్గాల వారీగా అవసరమైన కొత్త ఫారాలను జిల్లా ఎన్నికల అధికారులు తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణా తరగతుల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో స్వచ్ఛందంగా అనుసంధానం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా ప్రజలను చైతన్యపర్చేలా చూడాలన్నారు. ఓటర్లు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆధార్ను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉన్నదని తెలిపారు. ఎన్నికల విధు లు నిర్వర్తించే అధికారులు, సహాయ అధికారులు, సాంకేతిక సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఇందులోభాగంగా రాష్ట్రస్థాయిలో బుధ వారం నిర్వహించనున్న శిక్షణ తరగతులకు ప్ర తి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మాస్టర్ ట్రైనీలను పంపించాలని సూచించారు. వీరు తమ జిల్లాల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈనెల 30 లోపు అన్ని స్థాయిల్లో శిక్షణ తరగతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ..ఈనెల 28న జిల్లాస్థాయిలో కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. 29న మండల స్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్కుమార్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్ పాల్గొన్నారు.