హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచీ తెలంగాణ అంటే చిన్న చూపే. తెలంగాణ పుట్టుకే ఇష్టం లేనట్టు వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో. రాష్ట్ర ప్రతినిధులను అవమానించిన ఘటనలు కోకొల్లలు. తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కేంద్ర మంత్రులకు అలవాటైపోయింది’ అని ఫైరయ్యారు. నూకలను తెలంగాణ ప్రజలకే తినిపించాలంటూ ఇచ్చిన సమాధానం నిర్లక్ష్యం కాదని, తెలంగాణ పట్ల బీజేపీ వివక్షకు నిదర్శనమని దుయ్యబట్టారు.
‘మాకు నూకలు తినడం తెలుసు.. మిమ్మల్ని తెలంగాణ నుంచి బయటికి నూకడం కూడా తెలుసు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘గోవు పేడను తింటూ.. గో మూత్రాన్ని తాగేవాడికి నూకలతో అన్నం అంటే రిచ్గా కనిపించిందేమో?’ అని మరో నెటిజన్ చురక అంటించారు. ‘నూకలు దగ్గర పడ్డోళ్లు.. మందిని నూకలు తినుమంటుండ్రు. మట్టికొట్టుకుపోతావ్’ అంటూ ఓ యువకుడు స్పందించగా.. ‘తెలంగాణ వేసే ఎంగిలి మెతుకులతో ఉత్తరాది రాష్ర్టాలను పోషించుకుంటూ మమ్మల్ని అవమానిస్తావా’ అంటూ ఓ నెటిజన్ ఘాటుగా బదులిచ్చారు.
కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను అవమానిస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘తెలంగాణ బీజేపీ నాయకుల్లారా.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గుజరాతీ గులాంలలా ఉంటారా? తెలంగాణ సేవకుల్లా ఉంటారా? ఆలోచించుకోండి’ అని ఓ నెటిజన్ నిలదీశారు. ‘మన ఆర్ఆర్ఆర్ ఎమ్మెల్యేలు (బీజేపీ) ఏం చేస్తున్నరు? నూకలతో బిర్యానీయా?’ అని మరో నెటిజన్ చురక అంటించారు. ‘పాలించడం చేతగాక ప్రజలకు నూకలు తినిపించండి అని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వం. అయినా వంతపాడుతూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వెకిలి వేషాలు వేస్తున్న తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు’ అంటూ మరో నెటిజన్ ఫైరయ్యారు.
వడ్లు వరదన పోతుంటే…
నూకలు గట్టిగా పట్టుకున్నట్టు!!
అన్నం అంటే ఆహారం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కూడా. వరి బియ్యపు అన్నం తినడం ఒక స్టేటస్ సింబల్.
తెలంగాణ నూకలు తిన్న కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంటి వంట గదిలోనూ సన్నాలే.. ప్రతి విద్యార్థుల వసతి గృహంలోనూ సన్నాలే.. తెలంగాణలో ఇప్పుడు ప్రతిరోజూ స్వామిబువ్వ తినే పండుగ రోజే.. తెలంగాణలో ఇప్పుడు ప్రతిఒక్కరూ రాజాన్నం తినే రాజులే.. తెలంగాణ రైతు ఇప్పుడు రోజూ రెండు పూటల సన్న బియ్యం తినే ధనవంతుడు. అంతేకాదు దేశానికి అన్నం పెట్టగల ఉదారి.
అలాంటి తెలంగాణ ప్రజల్ని.. ‘మంచి బియ్యం మాకివ్వండి. ముక్కిన నూకలు మీరు తినండి’ అనడం ద్వారా కేంద్ర మంత్రి పీయూష్గోయల్ తెలంగాణ ప్రజల ఆహారాన్నే కాదు, ఆర్థిక స్థితి గతులను, ఆత్మగౌరవాన్ని కూడా అవమానించారు.
‘నూక-రాజు’ వ్యాఖ్యలపై తెలంగాణ మనస్సు రగులుతున్నది. ఆగ్రహమై కేంద్రానికి తలుగుతున్నది.
నీళ్ల వసతి సక్కగ లేక కడుపులు మాడ్చుకొని బతికినం. అప్పట్లో వడ్లు కొద్దోగొప్పో పండినా అందరికీ అందే పరిస్థితులు లేకుండే. వాటికి బదులుగా నూకలు తిని బతికినం. బీజేపీ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడి అవమాన పరుస్తుండ్రు. మాయ మాటలు, మోసాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన వాళ్లు నీతిమంతుల లెక్క బింకాలు పలుకుతుండ్రు. వాళ్లకు రైతుల మీద సోయి లేక ఇట్ల నూకలు చెల్లిన కూతలు కూస్తుండ్రు. వడ్లు కొనకుంటే తిరుగుబాటు తప్పదు.
– కుక్కునూరి భిక్షమయ్య, రైతు, కల్మల్చెర్వు, సూర్యాపేట జిల్లా
మదపుటేనుగులా మాట్లాడుతున్నారు..
మర్చిపోకండి మీ మదం దించే మావటులు తెలంగాణ ప్రజలని..
పంజాబ్ రైతులు జాడిస్తే బిల్లులు వెనక్కి తీసుకొన్నారు..
అక్కడ అడ్రస్ లేకుండా పోయారు..
తెలంగాణలోనూ మీ బతుకదే…
మా నూకలు మేమే తింటామో..మీకు నూకలు లేకుండా చేస్తామో..
వచ్చే ఎన్నికల్లో చూయిస్తాం
(– కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ ఆగ్రహం ఇది.)
‘ఒకడు తల్కాయ యాడవెట్టుకుంటవ్ అన్నడు.. తెలంగాణకు పాస్పోర్ట్ తీసుకొని పోవాలె అన్నడు.. పావురాల గుట్టల మాయమయ్యిండు!
ఇంకొకడు ఒక్క రూపాయి ఇయ్యను పో అన్నడు..తెలంగాణ వస్తే చీకటైతదన్నడు.. రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిండు!!
ఒకామె తెలంగాణను పాకిస్థాన్ అన్నది ఇప్పుడు ఆమె తెలంగాణల ఊర్లు పట్టుకొని తిరుగుతున్నది!
తల్లిని సంపి పిల్లను తీసిండ్రు అన్న మీ నాయకుడు.. నూకలు తినమన్న నువ్వు.. మా కండ్ల ముంగల రాజకీయ మనుగడ కోల్పోయి తిరిగే రోజు తప్పకుండా వస్తది!!
నూకలు తినుమన్న నీకు రాజకీయంగా నూకలు చెల్లడం తెలంగాణ చూస్తుంది.. వింటుంది’ (- మరో నెటిజన్ ఆగ్రహావేశం)