బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: తమ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో తాగుబోతులు తిష్టవేశారంటూ ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే.. వారిని అక్కడినుంచి పంపించి తమ సమస్యను పరిష్కరించారంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో సోమవారం రాత్రి కొంతమంది కూర్చుని మద్యం తాగుతున్నారు. మత్తులో కాలనీలోని ఇండ్లముందు తిరుగుతుండటంతో ఆందోళనకు గురైన ఆమె… బంజారాహిల్స్ అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.
తక్షణమే స్పందించిన ఎస్ఐ.. పెట్రోలింగ్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో స్థానిక పెట్రోలింగ్ కానిస్టేబుల్ శ్యామ్కుమార్, హోంగార్డు నర్సింహ అక్కడికి వెళ్లగా మందుబాబులు గమనించి అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారంటూ ఆ మహిళ నగర పోలీస్ కమిషనర్కు ఫేస్బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రెండేండ్ల క్రితం కూడా ఇదే విధమైన సమస్య ఎదురయినప్పుడు కూడా పోలీసులు క్షణాల్లో స్పందించారని గుర్తుచేసుకున్నారు.