అమరావతి: యువకుడు ఆత్మహత్యకు సీఐ కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు తూర్పు గోదావరి జిల్లా మండపేట సీఐ దుర్గాప్రసాద్ను అధికారులు సస్పెన్షన్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను ఏలూరు రేంజ్ డీఐజీ జారీ చేశారు. మండపేటకు చెందిన యువకుడు కాళీకృష్ణ అదే గ్రామానికి చెందిన బాలికతో చనువుగా ఉంటున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు యువకుడని పోలీస్స్టేషన్లో విచారణలో భాగంగా సీఐ కొట్టడంతో మర్మావయవాల వద్ద గాయాలయ్యాయని మృతుడి బంధువులు ఆరోపించారు.
చికిత్స కోసం వైద్యుడికి చూపించామని, బాధ భరించలేక బయటకు వెళ్లిన కాళీకృష్ణ ఏడిద రోడ్డులో మరణించి ఉన్నట్లు గుర్తించామని బంధువులు పేర్కొన్నారు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు రాత్రి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీఎస్పీ బాలచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాద్, ఓ కానిస్టేబుల్, బాలిక తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేశారు. సంఘటన విషయంపై స్పందించిన రేంజ్ డీఐజీ ప్రాథమిక నివేదికను తెప్పించుకుని సీఐ దుర్గాప్రసాద్ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.