కరీంనగర్ : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తీరుపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
నైతిక విలువలు లేని వారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కూతురులా చేరదీసి రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్ను విమర్మిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
గతంలో సీఎం కేసీఆర్ ఫొటోతో ఎమ్మెల్యేగా గెలిచావన్న విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు.
నాడు పదవి కోసం తండ్రి, దేవుడిలా కనిపించిన కేసీఆర్ ఇవాళ దెయ్యం అయ్యారా అని నిలదీశారు. గతంలో ద్విచక్రవాహనంపై తిరిగిన నీకు వందల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.
‘పూలహారాలు వేసిన నియోజకవర్గ ప్రజలే నిన్ను చీపుర్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కదనే భయంతో స్థాయికి మించి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నావు.
అసెంబ్లీలో ప్రమాణ స్వీకార పత్రాన్ని చూసుకుంటూ చదవలేని దద్దమ్మవు కేసీఆర్ను విమర్శిస్తావా. మహిళలు, దళిత జాతికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్న శోభ ప్రవర్తన మార్చుకోవాలి’ అని హెచ్చరించారు.
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఉద్యోగ నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.
కేంద్రం ఇస్తానన్న కోటి ఉద్యోగాల జాబితాతో బీజేపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి