హుజురాబాద్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్ కు అండగా నిలుస్తూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ హుజరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని, హుజూరాబాద్ నియోజకవర్గంలో 2001 నుంచి ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టారని తెలిపారు.
ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలి..
ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కష్టపడే వ్యక్తి అని పేదల బాధలు తెలిసిన వ్యక్తి అని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి…అంతేకాదు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు.
బీజేపీ బడా ఝూటా పార్టీ..
బీజేపీ పార్టీ బడా ఝూటా పార్టీ అని, నూతన వ్యవసాయ చట్టాలను ఎందుకు రద్దు చేయలేకపోతున్నారో చెప్పాలని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా లక్షానూటపదహారు రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాదు పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టు కూడా తెలంగాణ సర్కారు అందిస్తున్నది ఆయన తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు…
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని సకాలంలో అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వివరించారు.పిల్లల కోసం గురుకుల పాఠశాలను స్థాపించి ఉచిత విద్యను,దళిత బంధు పథకం ద్వారా దళితులకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ధాన్యపు గింజా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్,ట్రాలీ అందజేయడం జరిగిందని ఆయన అన్నారు.
ప్రతీ ఎకరాన్ని డిజిటల్ చేసి ఉచితంగా డిజిటల్ పాస్ పుస్తకాలను అందించడం జరిగిందని , ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడం జరిగిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో చెరువులను, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు.