సెయింట్ జాన్స్ : వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తిరిగి ఆంటిగ్వా, బార్బుడా ద్వీపంలో తిరిగి అడుపెట్టాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం ఎగవేత కేసులో 2018లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే కారణాలతో మేలో డొమినికా పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా మెహుల్ చోక్సీ డొమినికా హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ.. ఆంటిగ్వాకు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో 51 రోజుల కస్టడీ అనంతరం 62 ఏళ్ల చోక్సీ ఆంటిగ్వా చేరుకున్నాడు. 10వేల ఈసీ డాలర్లు (ఈస్ట్ కరీబియన్ డాలర్లు) డిపాజిట్ చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. డొమినికా నుంచి ఒక ఛార్టర్డ్ విమానంలో ఆంటిగ్వాకు చేరుకున్నారు. అక్కడ న్యూరాలజిస్ట్ వద్ద ఆయన చికిత్స పొందనున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ 2018లో భారత్ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయాడు. మే 23న విందు కోసం వెళ్లిన చోక్సీ ఆ తర్వాత డొమినికాలో కనిపించాడు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఆంటిగ్వా నుంచి భారత్కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే డొమినికాలో పట్టుబడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆంటిగ్వా బీచ్ నుంచి కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ తరఫున న్యాయవాదులు ఆరోపించారు.