ఇటీవల ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది. కానీ ఈ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు స్టార్ హీరో చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం అనంతపురంలో జరిగింది. ఇందులో నయనతార నాయికగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి మట్లాడుతూ…’నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతుంది. ఇవాళ మా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వర్షం పడటం ఆ భగవంతుడి ఆశీర్వాదమే అనుకుంటున్నా. గాడ్ ఫాదర్ సినిమా నేను చేయడానికి కారణం రామ్ చరణ్. చరణ్ లూసీఫర్ సినిమా చూసి నాన్నా..ఇప్పుడు నీకున్న ఇమేజ్ కి ఈ సినిమా చేస్తే బాగుంటుంది అన్నాడు. అలాగే దర్శకుడిగా మోహన్ రాజా ఈ సబ్జెక్ట్ బాగా డీల్ చేయగలడు అని సూచించాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది.
జయాపజయాలు అందరికీ సహజమే. గత చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయానే అనే బాధ నాలో ఉంది. ఈ సినిమాతో ఆ బాధ తీరిపోతుంది. గాడ్ ఫాదర్ సినిమా మీ అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విజయానికి నాదీ పూచీ. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారు. నాకు సపోర్ట్ గా ఉండే పాత్రలో సల్మాన్ ఖాన్ మెప్పిస్తాడు. చరణ్ అడగగానే సల్మాన్ కథ కూడా వినకుండా నటించేందుకు ఒప్పుకున్నాడు. నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్ ఇలా ప్రతి పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మూల కథలో సంగీతానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయినా థమన్ దీన్నో మ్యూజికల్ మూవీగా మార్చాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ అదిరిపోతాయి. విజయదశమికి హిట్ చిత్రంతో కలుద్దాం’ అన్నారు.