హైదరాబాద్: రక్తదానం చేయడం చిన్నవిషయం కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం చేసినవారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందని చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి రాజ్భవన్లో ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను హౌస్ సర్జన్గా పనిచేస్తున్నప్పుడు రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని రోజులు చూశానని గుర్తుచేసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవ చేస్తు్న్న మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు.
అంతకుముందు చిరంజీవి మాట్లాడుతూ.. 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని.. వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించామని చెప్పారు. తరచూ 2 నుంచి 3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారని వెల్లడించారు. అలాంటి వారికి ఏదైనా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో దవాఖాన కూడా నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, అందులో 70 శాతం పేదలకు ఉచితంగా అందించగా, మిగిలింది ప్రైవేట్ దవాఖానలకు అందజేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందన్నారు.