మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇల్లందులో జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొంటున్నాడు. మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ జరిపాడు కొరటాల శివ. ఇప్పుడు ఇల్లందులో మేజర్ షెడ్యూల్ జరుగుతుంది. దీనికి సంబంధించిన లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు.
ఇద్దరు మిలటరీ డ్రస్ లో ఉండడం విశేషం. ఈ సినిమాలో దాదాపు అరగంట పాటు ఉండే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. దీని కోసం కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. పైగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రామ్ చరణ్ కూడా చెప్పాడు. తండ్రితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ సినిమా తన తల్లికి కూడా చాలా ప్రత్యేకమైంది అంటూ ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్. దాంతో కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోవడం లేదు. షూటింగ్ లేట్ అయినా పర్లేదు కానీ అన్నీ పక్కాగా చూసుకొని ముందుకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే మార్చి మొదటి వారంలో రామ్ చరణ్ ఆచార్య షెడ్యూల్ లో అడుగుపెట్టాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. ఈమె కూడా షూటింగులో పాల్గొంది. గతంలో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటమ్ సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డే.. ఇప్పుడు రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా బయటికి వస్తున్న లొకేషన్ పిక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ చనిపోయే పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మే 13 వరకు ఆగాల్సిందే.