‘వెలుగు అంటే దేవుడు అని అంటున్నారు, మరి చీకటి ఏంటి గురువు గారూ! దయ్యమా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. దానికి గురువు ‘లేదు నాయనా! దయ్యం అనే భావనకు భారతీయ తాత్విక చింతనలో ఎలాంటి భాగం లేదు. అదసలు ఎలాంటి ఉనికీ లేని ఒక భ్రాంతి. నీ ప్రశ్న చీకటి అంటే ఏమిటి? అని. చీకటి అంటే సాధారణంగా వెలుతురు లేని ప్రాంతంగా గుర్తిస్తాం. వెలుతురు పడగానే చీకటి మాయమైపోతుంది. మన గృహాన్నే తీసుకుందాం. వెలుతురు రాగానే ఇంట్లో ఉన్న వస్తువులు, గోడలు, ద్వారాలు అన్నీ కనబడతాయి. కేవలం వెలుగు వాటిని సూచిస్తుంది. నిజానికి వాటి ఉనికి మనకు కనబడకుండా అంతకు పూర్వమే ఉన్నదే. ఇదంతా మన పర్యావరణంలో జరిగే దృగ్విషయం’ అని బదులిచ్చాడు గురువు.
ఇదే విషయాన్ని అంతరిక్షంలో చూద్దాం. సౌరమండలంలో సూర్యుడి కాంతి సోకిన ప్రదేశం కాంతిమంతంగా ఉంటుంది. సోకని ప్రదేశంలో చీకటి నిండి ఉంటుంది. గ్రహాల భ్రమణ, పరిభ్రమణాల వల్ల చీకటి వెలుగు ఏర్పడుతున్నాయి. చీకటి కాలాన్ని రాత్రి అంటున్నాం. ఆ రాత్రి మన ఉదయపు జీవితానికి దోహదపడుతున్నది. అంతరిక్షం దాటి ఆకాశంలోకి మన దృష్టి సారిస్తే నక్షత్రమండలాలు ఉంటాయి. వాటిని దాటివెళ్తే అంతా చీకటి. ఆ చీకటి మన ఇంద్రియాలకు సోకని, తాకని చీకటి. చివరికి కాంతి కూడా సోకలేని చీకటి. దాని ఆనుపానులు కూడా కనుక్కోలేనంత చిత్రమైన చీకటి. దాన్నే ఆధునిక శాస్త్రవేత్తలు కృష్ణశక్తి అనీ, కృష్ణ పదార్థమనీ విశ్లేషిస్తున్నారు. అది చీకటా, నలుపా లేక ఇంకొకటా అనేది గుర్తించలేని మేధస్సు మనది.
ఖగోళంలో ఉన్న నక్షత్రాలు వెదజల్లే కాంతి సోకలేని ప్రాంతమంతా ఆ కృష్ణ పదార్థమే ఆవరించి ఉంది. అది పరమశక్తి రూపం. ఆ రూపం ఉందో లేదో అనేంత సూక్ష్మమైనది. అలాంటి వస్తువే మనకూ, ఈ చరాచర సృష్టికీ హేతువు. సాలీడు నుంచి దారం పుట్టినట్టుగా ఆ సూక్ష్మరూపం నుంచే సృష్టి పుడుతుందని చెప్తున్నది ముండకోపనిషత్తు. అంతేకాకుండా దానిగురించి పలువిధాలుగా వర్ణిస్తూ మనలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. భగవద్గీత కూడా ఆ వస్తువును అర్థం చేసుకున్నవాడు ఆశ్చర్యపోతాడని పేర్కొన్నది.
న తత్ర సూర్యోభాతి న చన్ద్రతారకం
నేమా విద్యుతో భాన్తి కుతోయమగ్నిః
తమేవ భాన్తమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి॥
‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు; చంద్రుడూ, నక్షత్రాలూ ప్రకాశించవు; మెరుపులు మెరవవు. ఈ అగ్ని ఎలా ప్రకాశిస్తుంది? సమస్తం దాని ప్రకాశం చేతనే ప్రకాశిస్తున్నాయి’ అని శ్లోకానికి అర్థం. ఆధునిక శాస్త్రవేత్తలు ఏ కృష్ణ పదార్థం, కృష్ణశక్తుల గురించి చెప్తూ, నక్షత్ర మండలాల నడుమ కాంతి కూడా వంగి ప్రయాణిస్తుందని, అందుకు కారణం ఆయా శక్తులు భౌతికశాస్త్ర ప్రమాణాలకు అతీతమైనవి కావడమే అని చెప్తున్నారు. అందుకే గీతాచార్యుడు సాంఖ్యయోగంలో ఆ ఆత్మను గురించి విశేషంగా వర్ణించాడు. ఉపనిషత్తులు ఆ ఆత్మ లక్షణాలను ఎలుగెత్తి చాటుతున్నాయి.
‘గురువుగారూ! సాలీడు దారంలాగా ఈ విశ్వం ఆ పదార్థం నుంచి పుడుతూ, ఆ పదార్థంలోకే పోతూ ఉందంటున్నారు. మరి ఈ విశ్వంలో ఉన్న ప్రతి విభూతిలో ఆ పదార్థమే ఎలా నిండి ఉంది?’ అని అడిగాడు శిష్యుడు. ‘చక్కని ప్రశ్న వేశావు. ఆ పదార్థమే పరిణమించి విశ్వంగా రూపుదిద్దుకున్నది. అంతేకాకుండా, కనిపించే ప్రతి విభూతిగానూ మారింది. అలా మారగలగడం వల్ల తిరిగి అది కృష్ణ పదార్థంలో లీనం కాగలుగుతున్నది. ఇలా ఉత్పత్తి, స్థితి, లయల చక్రీయ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ వస్తున్నది. అదే ఆత్మసూత్రమై ఉంది. ఈ మొత్తం దృగ్విషయాన్ని దూరంగా చూస్తే చీకటి వెలుగుల రంగేళిలా కనిపిస్తుంది. ఇలా చీకటి, వెలుగులు అంటే పదార్థమూ, శక్తీ విడివడకుండా అనంత విశ్వమంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ చీకటి వెలుగుల సంగమాన్నే మనం ఆత్మ అనీ, భగవంతుడు అనీ అనుకుంటున్నాం’ అని ముగించాడు గురువు. చీకటి, వెలుగులు రెండూ పరస్పర ఆధారితాలు. ఎన్నటికీ విభజించలేనివి. ఒకటి మరొకటిగా మారుతూ నిరంతరత్వాన్ని, అనంతత్వాన్ని పొదివి పట్టుకున్నాయి. మన సనాతన దైవత్వ ప్రతీకయైన అర్ధనారీశ్వర తత్త్వం నిగూఢత కూడా ఇదే!
రావుల
నిరంజనాచారి