రామాయణంలో వాలిపుత్రుడైన అంగదుడు కార్యసాధకుడికి ఉండాల్సిన మూడు లక్షణాలను ఇలా పేర్కొన్నాడు. అందులో మొదటిది ఉత్సాహం (నిర్వేదం లేకపోవడం). రెండోది ఓడిపోతామనే ఆలోచనను మనసులోకి రానివ్వకపోవడం. చేయాల్సిన పనిలో నేర్పును కలిగి ఉండటం మూడోది. పై మూడు లక్షణాలను పరిపూర్ణంగా కలవాడు హనుమంతుడు. అందుకే, సీతాన్వేషణ కోసం బయల్దేరిన వానరుల్లో ఆంజనేయుడిపైనే సుగ్రీవుడు అధిక విశ్వాసం చూపాడు. ‘స్వామి భక్తి పరాయణుడైన హనుమంతుడే అవలీలగా సముద్రాన్ని దాటగల సమర్థుడు, సీతమ్మ జాడ తెలుసుకోగల కార్యసాధకుడు’ అని భావించాడు. సీతాన్వేషణకు బయల్దేరుతున్న తరుణంలో ఆంజనేయుడితో సుగ్రీవుడు ఇలా పలికాడు..‘త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిః పరాక్రమః
దేశకాలాను వృత్తిశ్చ నయశ్చ నయపండితః॥’
‘ఓ ఆంజనేయా! నీవు వానరులలో శ్రేష్ఠుడివి. నీతిమంతుడివి. ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తించాలో సమగ్రంగా తెలిసినవాడివి. బుద్ధి బలాన్ని, దేహ బలాన్ని, పరాక్రమాన్ని కలిగి ఉన్నవాడివి. పైగా దేశకాలాలకు తగినట్లుగా ప్రవర్తించే నేర్పు నీలో ఉన్నద’ని పలికాడు. ‘అసలు ఈ భూమండలంపై గాని, భూమికి సమీపంలో పక్షులు ఎగిరే మార్గంలో గాని, సుదూరమైన ఆకాశంలో గాని, స్వర్గంలో కానీ, అలాగే నీటిలో కూడా సాగే నీ ప్రయాణానికి అడ్డంకులేర్పడవు. దేవ, గంధర్వ, అసుర, నరుల లోకాలతో, నాగజాతికి చెందిన లోకాలతోనూ నీకు సమగ్ర పరిచయం ఉన్నది. ప్రయాణించే విధానంలో, ప్రయాణ వేగంలో, తేజస్సులో నువ్వు నీ తండ్రి వాయుదేవుడితో సమానుడివి. సర్వ సమర్థుడవైన నీతో సమానమైన ప్రాణి గానీ, వ్యక్తి గానీ ఈ భూలోకంలోనే లేడు. ఓ హనుమా! ‘తద్యథా లభ్యతే సీతా తత్ త్వమేవాను చింతయ’ సీతమ్మ జాడ తెలుసుకునే ఉపాయం నీవే ఆలోచించు’ అని సుగ్రీవుడు హనుమతో పలికాడు.
ఈ మాటలు విన్న శ్రీరాముడికి హనుమంతుడు గొప్ప కార్యసాధకుడని స్పష్టంగా అవగతమైంది. సీత క్షేమ వృత్తాంతాన్ని తెలుసుకొని రాగల సమర్థుడు అతనే అని భావించి, తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు రాముడు. సుగ్రీవుడి విశ్వాసాన్ని, శ్రీరాముడి అనుగ్రహాన్ని తోడుగా చేసుకొని ఆంజనేయుడు సముద్రాన్ని అవలీలగా దాటాడు. మైనాకుణ్ని మంచి మాటలతో బుజ్జగించాడు. సురస, సింహికలను సునాయాసంగా ఓడించాడు. లంకిణికి తగిన బుద్ధి చెప్పి లంకలోకి ప్రవేశించాడు. శత్రు దుర్భేద్యమైన లంకలో నిర్భయంగా ఎవరికంటా పడకుండా సీతమ్మను వెతికాడు హనుమ. తనశక్తికి శ్రీరామభక్తిని జతపరిచాడు. సీతమ్మను దర్శించాడు. రాక్షస బాధను సహించలేక ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతాదేవికి దివ్యౌషధంగా శ్రీరామ చరితాన్ని వినిపించాడు. సీతాదేవికి శ్రీరామ నామాంకితమైన ఉంగరాన్ని అందించాడు.
శ్రీరాముడి గుణాలను కీర్తించి సీతమ్మకు నమ్మకాన్ని కలిగించాడు. రాక్షస పరివారానికి, లంకేశ్వరుడికి శ్రీరాముడి బలాన్ని రుచి చూపించాడు. సీతమ్మ నుంచి చూడామణి తెచ్చి రాముడికి అందజేశాడు. సీతారాములిద్దరికీ ఒకరి క్షేమవార్తను మరొకరికి తెలిపి ఇద్దరి ప్రాణాలనూ కాపాడాడు.
మనోవేగంతో, వాయువేగంతో ప్రయాణం చేయగలిగేవాడు, జితేంద్రియుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానర ప్రముఖుడు, వాయునందనుడు అయిన హనుమ అందరికీ ఇష్టదైవమే! హనుమంతుడిలో నిండుగా, మెండుగా ఉండే బుద్ధిబలం, దేహబలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, ఉత్సాహం, వాక్పటుత్వం, కార్యదక్షత ఆ స్వామిని కొలిచే భక్తులకూ సంక్రమిస్తాయి. హనుమంతుడి అనుగ్రహంతో మనందరిలో సత్కార్య నిర్వహణ చేయగలిగే కార్యదక్షత ఏర్పడాలని ఆశిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067