పూర్వం కౌశికుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఒకనాడు చెట్టునీడన కూర్చొని వేదమంత్రాలు చదువుకుంటున్నాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పిట్ట ఆయన తలమీద రెట్ట వేసింది. కౌశికుడు కోపంగా తల ఎత్తి చూశాడు. చెట్టుమీద కొంగ కనిపించింది. తీక్షణంగా దానినే చూసేసరికి ఆ కోపానికి తట్టుకోలేక కొంగ చెట్టు మీద నుంచి కిందపడి చచ్చిపోయింది.
ఆ తర్వాత కౌశికుడు ఎప్పటిలాగే గ్రామంలోకి భిక్షాటనకు బయల్దేరాడు. ఇంటి గుమ్మం ముందు నిలబడి ‘భవతీ భిక్షాందేహి!’ అని కేక వేశాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇంటి పనిలో ఉంది. పని అయిన తర్వాత తనకు భిక్షం వేస్తుందేమోనని కౌశికుడు వాకిట్లోనే కనిపెట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇంతలో బయటనుంచి ఆ ఇల్లాలి భర్త వచ్చాడు. వస్తూనే ‘ఆకలి ఆకలి’ అన్నాడు. అది విని భర్తకు కాళ్లూచేతులూ కడుక్కోవడానికి నీళ్లిచ్చి, వంటింట్లో పీటవాల్చి, ఆకు వేసి అన్నం వడ్డించింది.
బయట బ్రహ్మచారి అలాగే నిలబడి ఉన్నాడు. భర్త భోజనం చెయ్యడం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి భిక్ష వేద్దామని బయటికి వచ్చి, ‘పాపం మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను, క్షమించండి’ అంది ఆ ఇల్లాలు. కౌశికుడు కోపంతో మండిపడుతూ ‘అమ్మాయీ! ఎన్నో ఇండ్లకు పోవలసిన వాణ్ని. నన్ను అలక్ష్యం చేసి నీ ఇంటి దగ్గరే చాలాసేపు నిలబెట్టావు’ అన్నాడు. ‘స్వామీ! మన్నించండి. మా వారికి ఉపచర్యలు చేస్తూ ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైంది’ అంది ఆ ఇల్లాలు.
‘భర్తకు సేవ చేయడం ధర్మమే! కానీ, ఆ కారణంగా నన్ను అవమానించడం క్షమించరాని నేరం’ అన్నాడు కౌశికుడు కోపంగా. ‘అనవసరంగా కోప్పడకండి మహాత్మా! పతిని పూజించే నా మీద అభాండాలు వేయకండి. నేనేమీ కొంగను కాదు, మీ చూపులకు కిందపడి గిలగిల తన్నుకుచావడానికి! భర్త సేవను మించిన సేవ లేదు ఇల్లాలికి. మీ కోపం నామీద పనిచేయదు’ అంది ఆమె.
కొంగను గురించి ఆమెకు ఎలా తెలిసిందా! అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అదే అడిగాడు. ‘మహాత్మా! మనిషికి కోపానికి మించిన శత్రువు లేదు. ఆవేశమే అన్ని అనర్థాలకు మూలకారణం. మీరు మిథిలా నగరానికి వెళ్లి అక్కడ ధర్మవ్యాధుడ్ని కలుసుకోండి. అతను మీకు హితవు చెబుతాడు’ అంది ఆ ఇల్లాలు. ‘తల్లీ! నువ్వు నా కండ్లు తెరిపించావు. నీకు శుభం కలుగుగాక’ అని పలికి కౌశికుడు మిథిలకు పయనమయ్యాడు.
ధర్మవ్యాధుడి కోసం కౌశికుడు మిథిలా నగరమంతా వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా కనిపించలేదు. చివరికి ఒక దుకాణంలో మాంసం అమ్ముతున్న మనిషిని చూపించి అతనే ధర్మవ్యాధుడని చెప్పారందరూ. మహర్షికి దిగ్భ్రమ కలిగింది. ముక్కు మూసుకుని దూరంగా నిలబడ్డాడు. అప్పుడు ధర్మవ్యాధుడే కౌశికుడిని సమీపించి ‘మహాత్మా! మహా పతివ్రత అయిన ఆ ఉత్తమ ఇల్లాలు మిమ్మల్ని నా దగ్గరికి పంపించి ఉంటుంది. రండి’ అని ఆహ్వానించాడు. కౌశికుడు విస్తుపోయాడు.
‘స్వామీ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. దయచేయండి’ అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ని తన ఇంటిలోకి తీసుకెళ్లాడు. అతిథికి అర్ఘ్యం ఇచ్చిన వెంటనే వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్యలు చేశాడు ధర్మవ్యాధుడు. వారికి సేవలు చేసిన తర్వాత కౌశికుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
కుశల ప్రశ్నలయ్యాయి. మాటల మధ్యలో ‘మునీంద్రా! ఏ పని చేసినా సరే ధర్మం తప్పకుండా చేస్తే అది దైవోపాసనే. జీవిక కోసం కులవృత్తి చేసుకోవడం జీవనధర్మం. పూజించడం, భార్యను ప్రేమతో చూడటం, తీరికవేళల్లో సజ్జనుల సేవ చేసి తరించటం, సద్గోష్ఠిలో పాల్గొనడం.. వీటికంటే వేరే ధర్మం ఉందని నేననుకోను. సమస్త ప్రాణుల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ భగవంతుడున్నాడు. దేవుణ్ని నమ్మినవాడు ఎన్నటికీ చెడడు. మాంసం దుకాణమైనా, కల్లు దుకాణమైనా తాను చేస్తున్న పనిని ధర్మం తప్పకుండా చేస్తే ముక్తిని పొందవచ్చు’ అన్నాడు వినయంగా ధర్మవ్యాధుడు.
ఆ మాటలతో కౌశికుడికి జ్ఞానోదయం కలిగింది. ఇంతకాలంగా తాను అలక్ష్యం చేసిన తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను గుర్తించి వెంటనే ఇంటికి పయనమయ్యాడు. వేదాంత తత్వజ్ఞానంతో, అధ్యయనాలతో, తపస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని, మోక్షాన్ని.. ఉత్తమ ప్రవర్తనతో సాధించవచ్చు.
-ప్రయాగ రామకృష్ణ