చిన్నికృష్ణుడి అల్లరి అంతా ఇంతా కాదు. పొద్దుగూకే వేళకు ఇరుగుపొరుగులు రకరకాల ఫిర్యాదులు చేసేవారు. ఆ మాటలు విని యశోదకు కోపం వచ్చేది. ‘ఇదేం అల్లరి’ అని బాలకృష్ణుణ్ని నిలదీస్తే.. నల్లనయ్య చల్లగా కబుర్లు చెప్పేవాడు. మెల్లగా జారుకునేవాడు. ఓ రోజు ఇలాగే జరిగింది. కొంటె పనులను కట్టిపెట్టేయాలని కొడుకును హెచ్చరించింది యశోద. మాటలతో సరిపుచ్చలేదు. ఓ తాడును తెచ్చి, బాలకృష్ణుడిని రోలుకు కట్టిందట. అమ్మ అల్లంతదూరం వెళ్లగానే.. చిన్నికృష్ణుడు రోలుతో పాటుగా కదిలాడు. అక్కడున్న చెట్లను కూల్చి కుబేర కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుల శాపాలు పరిహరించాడు. ఈ వృత్తాం తాన్ని ‘దామోదర లీల’గా పరవశులై ప్రస్తుతిస్తుంటారు కృష్ణ భక్తులు.
స చ తేనైవ నామ్నాతు కృష్ణో వై దామ బంధనాత్
గోష్టే దామోదర ఇతి గోపీభిః పరిగీయతే
(హరివంశం-విష్ణుపర్వం 7-36)
సంస్కృతంలో దామం అంటే ‘తాడు’ అని, ఉదర అంటే ‘పొట్ట’ అని అర్థం. కొంటె చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుని ఉదరాన్ని తల్లి యశోదమ్మ త్రాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీలా వృత్తాంతపరంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే ‘దామోదర’. దామోదరుడు లీల చూపింది కార్తీక మాసంలోనే. శ్రీల సనాతన గోస్వామి రచించిన ‘బృహద్ వైష్ణవ తోషని’ గ్రంథానుసారం ఆచార్య శ్రీల చక్రవర్తి ఠాకూరుల వారు ‘దామోదర లీల’ కార్తీక మాసంలో జరిగిందని విశ్లేషించారు. కార్తీకంలో దామోదరుణ్ని ఆరాధించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయి. శ్రీకృష్ణుడు ఏ విధంగా భక్తవశుడు, భక్త పరాధీనుడన్న విషయాన్ని ఈ దామోదర లీల తెలియజేస్తుంది. శ్రీమద్భాగవతం (10.9.19)లో శుక మహాముని ఈ సందర్భాన్ని
ఇలా వివరించారు.
ఏవం సన్దర్శితా హ్యఙ్గ హరిణా భృత్యవశ్యతా
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే
‘ఓ పరీక్షిత మహారాజా! సమస్త విశ్వంతో పాటు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు సైతం ఆ దేవదేవుడి వశంలోనే ఉంటారు. అయినా ఆయనలో ఒక దివ్యగుణం ఉన్నది. అదే భక్తులకు పరాధీనుడై ఉండ టం. దామోదర లీలలో కృష్ణుడు చూపిన గుణం అదే! నల్లనయ్య చల్లని చూపులు కావాలనుకునే భక్తులు కార్తీకమాసంలో ‘దామోదర వ్రతాన్ని’ ఆచరించాల్సిందిగా అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులవారు సూచించారు. ఈ వ్రతంలో భాగంగా దామోదర మూర్తిగా ఉన్న శ్రీకృష్ణుడి పటాన్ని ఎదురుగా ఉంచి, దామోదర అష్టకంతో ఆరాధిస్తూ, నెయ్యి దీపాన్ని సమర్పించాలని తెలియజేశారు. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మహా మంత్రాన్ని గానం చేస్తూ కూడా దీపం సమర్పించవచ్చు.
పద్మే చ తత్రైవ ద్వాదశేశ్వపి మాసేశు కార్తీకః కృష్ణ వల్లభః
తస్మిన్ సంపూజితో విష్ణురల్పకైరపి ఉపాయనైః
దదాతి వైష్ణవం లోకమితి ఏవం నిశ్చితం మయా
పన్నెండు నెలల్లో కార్తీకం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పవిత్రమైన ఈ పుణ్యకాలంలో కొద్దిసేపైనా మహావిష్ణువును ఆరాధించిన వారికి, కార్తీకం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుందని పద్మ పురాణం చెప్తున్నది. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన ఈ నెలలో గోపాలుడి అనుగ్రహం కోరుతూ చేసే చిన్నపాటి సేవ అయినా ఆయనకు పరమానందాన్ని కలిగిస్తుందట.
దీపేనాపి హి యత్రాసౌ ప్రియతే హరిరీశ్వరహః
సుగీతం చ దదాత్యేవ పర దీప ప్రబోధనాత్
(హరి భక్తి విలాసం, 14.41-44)
కార్తీకంలో ఒక్క దీపాన్ని వెలిగించి, అర్పించినా శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. తోటి భక్తులు దీపాన్ని సమర్పించేందుకు వీలుగా వారి దీపాన్ని వెలిగించిన వారిని సైతం శ్రీకృష్ణుడు కొనియాడుతాడని పద్మ పురాణం వివరిస్తున్నది. భక్తులంతా ఈ కార్తీక మాసాన్ని శ్రీకృష్ణునిపై తమకు గల ప్రేమానురాగాలను మరింత పెంపొందించుకునేందుకు సద్వినియోగపరచుకోవాలి. దగ్గరలోని కృష్ణ మందిరాన్ని దర్శించుకోవడం మంచిది. అవకాశం ఉంటే దామోదర వ్రత విధానం తెలుసుకొని, ఆచరిస్తే మరింత పుణ్యప్రదం.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984