షాంఘై: ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ షాంఘైలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. ఆదివారం ఒకేరోజు 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతకొన్నాళ్లుగా లాక్డౌన్లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా వైరస్తో ఇద్దరు మృతిచెందారు. మృతులిద్దరు 89, 91 ఏండ్ల వయస్కులని, వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. కరోనా మలిదశలో చైనాలో కరోనా మరణాలు నమోదవడం ఇది రెండోసారి. గత నెలలో జిలిన్ ప్రావిన్స్లో మహమ్మారికి ఇద్దరు బలయ్యారు.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో చైనాలో షాంఘై కరోనాకు కేంద్రంగా మారింది. నగరంలో మార్చి మొదటివారం నుంచి ఇప్పటివరకు 3 లక్షల 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి స్థానిక ప్రభుత్వం కఠినమైన లాక్డౌన్ను అమలుచేస్తున్నది. దీంతో 25 మిలియన్లకుపైగా జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ బుధవారం నాటికి వైరస్ను నిలువరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో నగరవాసులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.