కోవిడ్ కారణంగా భారత్లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని షరతులతో, కొందరికే ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా చైనా సర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ చదివే భారతీయ విద్యార్థులు భారత్లోనే వుండిపోయారు.
ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. చైనాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. ఈ విషయంపై భారత్కు కొన్ని మార్గదర్శకాలను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి… అత్యావశ్యకమైన విద్యార్థులు మాత్రమే చైనాకు వచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో మెడిసిన్ అభ్యసిస్తున్నారు. 2019 లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారు భారత్కు తిరిగి వచ్చేశారు. చైనా ప్రభుత్వం మార్గదర్శకాలివ్వకపోవడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. అప్పటి నుంచి చైనాకు తిరిగి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కోవిడ్ కారణంగా చైనా సర్కార్ విధించిన ఆంక్షలతో ఇక్కడే వుండిపోయారు.
”ఇప్పుడు కోవిడ్ విజృంభణ చైనాలో తీవ్రంగానే వుంది. అయినా… భారత్కు చెందిన కొంత మంది విద్యార్థులను చైనాకు తిరిగి రప్పించేందుకు మేము రెడీగా వున్నాం. అంతర్జాతీయంగా వున్న కోవిడ్ పరిస్థితులను కూడా మేం లెక్కలోకి తీసుకోవాలి. ఈ సూత్రమే సహజంగా విదేశీ విద్యార్థులందరికీ వర్తిస్తుంది” అని చైనా అధికార ప్రతినిధి జావో లిజియన్ అన్నారు.