బీజింగ్: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి చైనా సర్కార్ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ సంస్థలకు ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఆ రంగ కంపెనీలకు 2030 వరకు పన్నుహాలీడే ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో డ్రాగన్ అప్రమత్తమైంది.
హువావేతో సహా చైనా టెక్ సంస్థలకు ప్రాసెసర్ చిప్లను సరఫరా చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా చైనా నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాల్లో సెమీకండక్టర్ల తయారీలో స్వయంసమృద్ధి సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని అధికారులను చైనా ప్రభుత్వం ఆదేశించింది.
తాజాగా ప్రకటించిన పన్ను విరామం ప్రకారం.. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్లు తయారు చేసే కంపెనీలు, వాటి తయారీకి కావాల్సిన ముడిసరుకు, యంత్ర పరికరాల దిగుమతిపై సుంకం మినహాయింపునిచ్చింది. అయితే, ఎంత పరిమాణం దిగుమతి చేసుకుంటే రాయితీ వర్తిస్తుందో మాత్రం చైనా ప్రకటించలేదు.
చైనా గత రెండు దశాబ్దాల్లో చిప్లు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు ఖర్చు చేసింది. కానీ, ఆ దేశంలోని టెక్నాలజీ సంస్థలు తమ పరికరాల తయారీకి అవసరమైన ముడి సరుకు కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్, తైవాన్పై ఆధారపడుతున్నాయి.
ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హువావే సహా పలు చైనా టెక్ కంపెనీలకు సరఫరా నిలిపివేయాలని సెమీకండర్లు, చిప్ తయారీ సంస్థలను నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. జనవరిలో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక స్పలంగా మార్పులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు.
కానీ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఆదేశాలను కొనసాగించడంతో చైనాకు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా మొబైల్ టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న హువావే గత ఏడాది చివరికల్లా ఐదో స్థానానికి పడిపోయింది.
ప్రపంచంలోకెల్లా సెమీ కండక్టర్లు, ప్రాసెసింగ్ చిప్ల దిగుమతిలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దిగుమతుల విలువ ఏడాదిలో 300 బిలియన్ల డాలర్ల పై చిలుకేనని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో చిప్లు, సెమీకండక్టర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదని చైనా నిర్ణయించింది. వీలైనంత త్వరగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్యూవీలకు ఫుల్ క్రేజీ.. ధరలు కూడా ఎక్కువే..
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
ఈక్వలైజేషన్ లెవీతో భారత్ తల గోక్కోవడమేనా!