హైదరాబాద్ : చిలుకూరి బాలాజీ ఆలయంలో సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. ఆలయ నిర్వహణ సిబ్బంది, గోశాల కార్మికులందరికీ టీకాలు వేసిన మొదటి ఆలయం ఇదేనని దేవస్థానం తెలిపింది. నిర్మలా హాస్పిటల్స్ సహకారంతో వారి కుటుంబ సభ్యులకు సైతం టీకాలు వేసినట్లు పేర్కొంది. గురువారం 50 మందికిపైగా సిబ్బంది, కుటుంబీకులు టీకాలు తీసుకున్నారని ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగ రాజన్ చెప్పారు. టీకాలు ప్రోత్సహించడంలో దేవాలయాలు, అన్ని మత ప్రదేశాలు ఉత్ప్రేరకంగా పని చేయాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కీలకమైన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వానికి సహాయపడతాయని అన్నారు. శిబిరంలో హెచ్హెచ్ఎఫ్ నిర్మలా వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.