ఆన్లైన్ క్లాసులు, లాక్డౌన్, గేమింగ్ అడిక్షన్ నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా పిల్లలు డిజిటల్ స్క్రీన్ను చూసే సమయం విపరీతంగా పెరిగిపోయింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఐదారు గంటలు, గేమింగ్, ఇతర కార్యకలాపాల కోసం సగటున మరో రెండు గంటలు.. మొత్తంగా కనీసం ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్కు అతుక్కుపోతున్నారు. ఇలా కొన్ని నెలలుగా సాగుతుండటంతో దేశంలోని స్కూల్ పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు లోపం), కమిటెంట్ ఈసోట్రిఫియా (మెల్లకన్ను) వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సంస్థ ఏటా ఆగస్టులో పిల్లల కంటి ఆరోగ్యం, భద్రతా అవగాహన మాసం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా తమ శాఖలతోపాటు ఇతర విభాగాల నుంచి సేకరించిన గణాంకాలను తాజాగా విడుదలచేసింది.
కరోనాకు ముందు మా దవాఖానల్లో పిల్లల్లో ఈసోట్రిఫియా కేసులు రోజుకు ఒకటి రెండు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు 10 కేసులకుపైగా కనిపిస్తున్నాయి. మయోపియా బాధితుల సంఖ్య కూడా రెట్టింపయ్యింది. మయోపియాను అరికట్టేందుకు చికిత్స ఉన్నది. కానీ కమిటెంట్ ఈసోట్రోఫియాను సరిదిద్దడం దాదాపు సాధ్యం కాదు. కాబట్టి తల్లిదండ్రులు కంటికి, డిజిటల్ స్క్రీన్కు మధ్య దూరంపై శ్రద్ధ చూపాలి.
– డాక్టర్ పాలక్ మచ్వానా, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్
తెలంగాణ కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్