న్యూఢిల్లీ : కరోనా రెండో దశలో దేశంలో విజృంభిస్తోంది. సెకండ్ ప్రభావం యువతపైనే తీవ్రంగా ఉంది. తొలి దశలో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, ఇందులో పిల్లలకు ఎక్కువ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మూడో దశను ఎదుర్కొనేందుకు కేంద్రం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యాచరణపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ మూడో దశ దృష్ట్యా చిన్నారులకు వైరస్ నుంచి రక్షణ అవసరమని.. చిన్నపిల్లలకు వైద్యసేవలు, వ్యాక్సిన్ ఇప్పటికే అందించాల్సిందన్నారు. భారత భవిష్యత్ను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం నిద్రలేవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు 12-15 ఏళ్ల పిల్లలకు టీకాలు వేసేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
మరో కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ సైతం కేంద్రంపై మండిపడ్డారు. చిన్నారుల వైద్య సేవల కోసం కేంద్రం ఏదైనా కార్యనిర్వహక దళాన్ని ఏర్పాటు చేసిందా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. డార్క్ చాక్లెట్లు, గోమూత్రం తాగడం వంటి సలహాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం థర్డ్ వేవ్ కోసం సిద్ధమవుతుందని, పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,329 కరోనా మరణాలు నమోదవగా.. 2.63 లక్షల కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.