లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి బయట మూడేండ్ల బాలిక దీనస్థితిలో మరణించిన ఘటనపై జాతీయ బాలల హక్కుల సంఘం శనివారం స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించింది. కాగా, తమ కుమార్తె ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారని, అంత చెల్లించలేకపోవడంతో యూనైటెడ్ మెడిసిటీ ఆసుపత్రి సిబ్బంది పాప పొట్ట వద్ద సర్జరీ చేసి కుట్లు వేయకుండానే బయటకు పంపివేశారని, దీంతో చాలా బాధతో తమ పాప చనిపోయిందని బాధిత తల్లిదండ్రులు శుక్రవారం ఆరోపించారు. సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండా వదిలేసినట్లు మీడియాకు చూపారు. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల సంఘం శనివారం స్పందించింది. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ప్రయాగరాజ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో 24 గంటల్లో నివేదించాలని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని పేర్కొంది. కాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై దర్యాప్తునకు జిల్లా మెజిస్ట్రేట్ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
మరోవైపు పాప మరణానికి తమ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణం కాదని యూనైటెడ్ గ్రూప్ ఉపాధ్యక్షుడు సత్పాల్ గులాటి తెలిపారు. ఆ పాప 15 రోజులు యూనైటెడ్ ఆసుపత్రిలో ఉన్నదని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సర్జరీ చేసి, అబ్జర్వేషన్లో ఉంచినట్లు వివరించారు. పాప తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అన్నారు. పాప కోలుకోకపోవడంతో మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు బయటకు తీసుకెళ్లారని తెలిపారు. సర్జరీ చేసిన చోట వైద్యులు కుట్లు వేశారని ఆయన చెప్పారు. పాపకు మరొకచోట చికిత్స అందించినప్పుడు సర్జరీని పరిశీలించేందుకు ఆ కుట్లు విప్పి ఉంటారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.