హైదరాబాద్ : హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. నవజాత శిశువు పుట్టిన 2 గంటలకే ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండటంతో.. పేట్లబురుజు ఆస్పత్రికి నిన్న సాయంత్రం వచ్చింది. గర్భిణి ప్రసవించిన బిడ్డను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువు నడుము పైభాగం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కింది భాగం చేప ఆకారాన్ని పోలి ఉంది. జననేంద్రియాలు, కాళ్లు అభివృద్ధి చెందలేదు. జన్యుపరమైన లోపాల వల్లే ఈ రకమైన శిశువులు జన్మిస్తారని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.