‘తెలుగు సినిమా సత్తా నేడు ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినీరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకు ‘సమ్మతమే’ అనే టైటిల్ను పెట్టడం సంతోషంగా ఉంది’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘సమ్మతమే’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయనతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రవీణ కంకణాల నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. అందరికీ సమ్మతమయ్యే చిత్రమనిపించింది’ అన్నారు. హీరో కిరణ్ వ్యక్తిత్వం తనకు బాగా నచ్చుతుందని..అందుకే గీతా ఆర్ట్స్ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. థియేటర్లలో చూసి ఆస్వాదించే సకుటుంబ కథా చిత్రమిదని నిర్మాత కంకణాల ప్రవీణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్, నిర్మాత బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.