రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా దూసుకెళ్తున్నది. ఇదేతరహా అభివృద్ధిని ఇప్పుడు యావత్ దేశం కోరుకుంటున్నది. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ నాయకుడని భావిస్తున్నది.
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసపుచ్చుతున్నారు. పలు బహిరంగ సభల ద్వారా కేసీఆర్ ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడుతున్న కష్టాల్లో ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు సగం పడ్డా వారి రాష్ర్టాలు వికాసంతో విరాజిల్లుతాయి. కానీ, ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అని గొప్పలకు పోతున్న బీజేపీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా పెద్దగా ఒరగబెడుతున్నదేమీ లేదు. బీజేపీ పాలనలో ఉన్న మెజారిటీ రాష్ర్టాలు పురోగమనంలో కుంటుపడినాయి. జీవన ప్రమాణాలు అడుగంటాయి. పొట్ట చేత పట్టుకొని ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణకు వలసలు కట్టడమే ఇందుకు సజీవ తార్కాణం. ఆయా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు, ప్రజలు చైతన్యవంతంగా ఉండటాన్ని బీజేపీ ఇష్టపడదు. ఇక్కడ కేసీఆర్ ఏమో సగటు తెలంగాణ పౌరునికి అభివృద్ధి ఫలమే ప్రథమ ప్రాధాన్యంగా విధాన నిర్ణయాలు అమలుచేస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంటరానితనం, అవినీతి, అనాగరికత, ఆటవికతలు మనసున్న ప్రతి గుండెనూ బరువెక్కిస్తాయి. మనిషిని మనిషిగా చూడలేని, మాన ప్రాణాలకు రక్షణ లేని స్థితిగతులు కలచివేస్తాయి. మధ్యయుగాల బాపతు అరాచకాలకు చిరునామాగా ఉన్న యూపీలో రైతులను కాన్వాయ్తో తొక్కించి చంపడం ఒక నెత్తుటి మరక. అదే యూపీలో ఇటీవల ఓ బాలికపై సామూహిక లైంగికదాడి జరిగినప్పుడు ఇంటికి ఆ బాలిక నగ్నంగా నడిచివెళ్లాల్సిన దుస్థితి. అక్కడ దౌర్జన్యపరులది రాక్షసత్వానికి పరాకాష్ట. రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు అన్నదాతలు ప్రాణాలే పణంగా పెట్టాల్సి రావడం దేశ ప్రజల గుండెలను పిండేసే వైనం. నిన్న మధ్యప్రదేశ్లో పోలీసులకు ఇవ్వాల్సిన లంచాల కోసం కూతుళ్లను అమ్ముకోవాల్సిన దుస్థితి గురించి స్వయంగా వారి పార్టీ మహిళా ఎంపీయే ఆరోపణలు చేయడం యావత్ భారతజాతిని ఆలోచింపజేసే అంశం. కర్ణాటకలో దేవుడి ప్రతిమను ముట్టుకున్నాడని ఓ దళిత బాలుడి కుటుంబాన్ని బహిష్కరించడం సభ్య సమాజం తలదించుకునే దృష్టాంతం. ఇక చాలీస్ (40) పర్సెంట్ కమీషన్ను చాలీసాగా పఠనం చేసే రాజకీయ నాయకుల అవినీతి ఇందుకు బోనస్. దేశంలోని అత్యధిక రాష్ర్టాల్లో మేమే అధికారంలో ఉన్నామని విర్రవీగే ఆ పార్టీ పాలనలో పాపాల చిట్టా కొండవీటి చాంతాడుకు మించే ఉంటుంది.
ఇవన్నీ చూస్తూ, వింటూ తెలంగాణ ప్రజలు మేమెంత సురక్షితంగా, బేఫికర్గా ఉన్నామో అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య విలువలను గరిష్ఠంగా అనుసరించడంలో కేసీఆర్కు మరెవరూ సాటిరారు. శాంతిభద్రతల కోసం దృఢమైన పోలీస్ వ్యవస్థను ఏర్పరిచారు. నాణ్యమైన, అత్యుత్తమమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించారు. సర్వమతాలు, సకల వర్గాల వారిని సమానంగా చూస్తున్నారు. సంక్షేమం సహా 360 డిగ్రీల్లో బ్యాలెన్స్ సూత్రాన్ని మనసా, వాచా, కర్మణా పాటిస్తూ జనరంజక పాలనను అందించడంతో కేసీఆర్ శిఖర సమానులయ్యారు.
ఇవే దృక్పథాలు, ఇవే పథకాలు, ఇవే విధానాలు దేశమంతటా అనుభవంలోకి తేవడం కేసీఆర్కు చిటికెలో పని! ‘ఆయన తెలంగాణకే పరిమితం కావాలనుకుంటే అది మా అంతులేని స్వార్థమే అవుతుంది! అందరూ బాగుండాలి.. అందులో మేం ఉండాలని’ అభిలషించే గడ్డ తెలంగాణ. భరతమాత బిడ్డలుగా, చైతన్యమంతమైన తెలంగాణ పౌరులుగా కేసీఆర్ దేశ సేవ చేయాలని ఆకాంక్షించడం మా సౌహార్ద్రతకు చిహ్నమవుతుంది. అందుకే కేసీఆర్ జిల్లాల వారీ పర్యటనల్లో ‘దేశ రాజకీయాల్లోకి పోవాల్నా..?’ అని అభిప్రాయాలు, మనోభావాలు రాబడుతుంటే వికారాబాద్ నుంచి నిజామాబాద్ దాకా ప్రజలందరూ బహిరంగంగా జేజేలు పలుకుతూ నిండు మనసుతో ఆ సభల్లోనే పోరాట సత్తువకు ప్రతిధ్వనిగా పిడికిలెత్తి నినదించారు.
ఇప్పటిదాకా దేశాన్నేలిన 14 మంది ప్రధానుల్లో దక్షిణాది వారు ఇద్దరే ఇద్దరు. కర్ణాటకకు చెందిన దేవెగౌడ కేవలం పది నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలుచేసి చరిత్రలో నిలిచారు. మిగతా ప్రధానుల్లో చాలామంది వారి సొంత రాష్ర్టాలనైనా బాగు చేశారా అంటే, అదీ లేదు.
హిందీ అయినా, ఇంగ్లీషు అయినా, తెలుగైనా, వేదిక ఏదైనా కేసీఆర్ సందేశం చిట్టచివరి పౌరుడి మదిని కూడా హత్తుకుంటుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకే దేశం ఆయనలో అభినవ మహాత్ముడిని, అభినవ వివేకానందుడిని, అభినవ అంబేద్కర్ను దర్శిస్తున్నది. భారతదేశాన్ని, దేశ రాజకీయాలను సుసంపన్నం చేసే సామర్థ్యం ఆయన సొంతం. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టే ప్రణాళికలు కేసీఆర్లో పుష్కలం. దేశ అభ్యున్నతి కోసం నిజాయితీగా కష్టపడటం కేసీఆర్ నైజం. అందుకే ఆయన సేవల కోసం దేశం ఆతృతగా వేచి చూస్తున్నది. దేశమంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నది.
(వ్యాసకర్త: సీనియర్ పాత్రికేయులు)
ప్రజాస్వామ్య విలువలను గరిష్ఠంగా అనుసరించడంలో కేసీఆర్కు మరెవరూ సాటిరారు. శాంతిభద్రతల కోసం దృఢమైన పోలీస్ వ్యవస్థను ఏర్పరిచారు. నాణ్యమైన, అత్యుత్తమమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించారు. సర్వమతాలు, సకల వర్గాల వారిని సమానంగా చూస్తున్నారు. సంక్షేమం సహా 360 డిగ్రీల్లో బ్యాలెన్స్ సూత్రాన్ని మనసా, వాచా, కర్మణా పాటిస్తూ, జనరంజక పాలనను అందించడంతో కేసీఆర్ శిఖర సమానులయ్యారు.
ఇల్లెందుల దుర్గాప్రసాద్: 94408 50384