మెట్పల్లి, మార్చి 25: రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించడమే లక్ష్యం గా కోర్టులు పనిచేస్తున్నాయని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్కోర్టుకు ప్రారంభోత్సవం, కోరుట్లలో సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించడం వల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని తెలిపారు.
న్యాయవాదుల సహకారం లేనిది కోర్టు నడవదని పేర్కొన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం చేకూర్చాలంటే న్యాయవాది పాత్ర కీలకమైనదని, లీగల్ సర్వీసెస్, చట్టాలపై పూర్తి అవగాహన కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలోని న్యాయకళాశాలలను, జడ్జీలను సంప్రదించాలని సూచించారు. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు.. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉండటం చారిత్రాత్మకమని చెప్పారు. సబ్కోర్టు ఏర్పాటు విషయంలో సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ అనుపమ చక్రవర్తి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్బాషా, ఎస్పీ భాస్కర్, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి పాల్గొన్నారు.