బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ఇరవైఏళ్ల క్రితం సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న సరికొత్త హంగులతో రీరిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ ‘ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి 25న రెగ్యులర్ షోలు ప్రదర్శిస్తాం. ఈ సినిమాకు డి.ఐ. చేయించి సరికొత్త సాంకేతిక హంగులతో తీర్చిదిద్దుతున్నాం. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా రెవెన్యూలో 70శాతం బాలకృష్ణగారి బసవతారకం ట్రస్ట్కు, మిగతాది నాకు సంబంధించిన అసోసియేషన్స్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘దర్శకుడిగా నా రెండో చిత్రమిది. ఆనాటి షూటింగ్ రోజుల్ని ఇప్పటికీ మర్చిపోలేను’ అన్నారు.