హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఏపీ-తమిళనాడు సరిహద్దులోని కోశస్థలి నదిపై చేపట్టిన రెండు ఆనకట్టల నిర్మాణంపై సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా అక్కడ ఎలాంటి ఆనకట్టలు నిర్మించకూడదని స్పష్టంచేశారు. దీన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కోశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.