హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో చెడ్డీగ్యాంగ్ (Cheddi gang) కలకలం సృష్టించారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలోని నాలుగు ఇండ్లలో చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గతేడాది ఇదే గేటెడ్ కమ్యూనిటీలో ఏడుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడటం గమనార్హం.