RBI Rules for Digital Loans | రుణాలు పొందిన వారికి, రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలకు మధ్య థర్డ్ పార్టీ జోక్యం పెరిగిపోవడంతో ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రుణాల మంజూరులో మోసపూరిత విధానాలు అవలంభిస్తూ.. దౌర్జన్యంగా వసూళ్లకు దిగడంతోపాటు పర్సనల్ డేటా చోరీ, అధిక వడ్డీ వసూలు చేయడం వంటి అంశాలు ఆర్బీఐ దృష్టికి వచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్నడిజిటల్ యుగంలో ఆన్లైన్ రుణాల పాలసీకి చెడ్డపేరు తెస్తున్న ఈ అనైతిక చర్యలను వ్యతిరేకించే నిబంధనలను ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ రూల్స్ అన్నీ బ్యాంకులు పాటించాల్సిందేనని తెలిపింది.
ఆన్లైన్లో రుణాలిచ్చే ఫిన్టెక్ సంస్థ.. ఈ-కేవైసీ పూర్తి చేసిన రుణ గ్రహీత ఖాతాలోనే ఆ రుణం డబ్బు జమ చేయాలి. వేరే సంస్థ నుంచి రుణం ఇవ్వడానికి వీల్లేదని ఆర్బీఐ నిబంధన తెచ్చింది. మోసపూరిత వ్యాపారాలను, అలా చేసే వారిని నిరోధించడానికి ఉపకరించనున్నది. డిజిటల్ రుణాల పేరిట అక్రమాలకు దిగుతున్న లోన్ యాప్లను అడ్డుకోవడానికే ఆర్బీఐ ఈ నిబంధనను తెచ్చింది.
ఏ ఫిన్టెక్ సంస్థ రుణాలిచ్చినా.. సదరు రుణ గ్రహీత తీసుకునే రుణాలను క్రెడిట్ బ్యూరోలు సేకరిస్తాయి. రుణం ఎంత? గడువు ఎంత అన్న దాంతో సంబంధం లేకుండా ఈ బ్యూరోలో ప్రతి రుణం వివరాలు రికార్డు చేస్తాయి. కానీ డిజిటల్ లోన్ యాప్ సంస్థలిచ్చే రుణాల వివరాలు సదరు క్రెడిట్ బ్యూరోలకు తెలియనివ్వడం లేదు.
రుణ గ్రహీత క్రమం తప్పకుండా చెల్లించినా ఆ వివరాలు సదరు బ్యూరోలకు అందడం లేదు. ఫలితంగా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. కానీ ఇప్పుడు కొని తర్వాత చెల్లించండి అనే సేవలందించే సంస్థలు తాము ఇచ్చే రుణాల వివరాలను సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరో సంస్థలకు చెప్పాల్సి ఉంటుంది.
రుణ గ్రహీత చేసే ప్రతి వాయిదా చెల్లింపు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ఆర్బీఐ నిబంధన తెచ్చింది. రుణం మంజూరు చేయడంలో మధ్యవర్తులుగా వ్యవహరించే వారు ఏ చార్జీలు తీసుకోవద్దు. రుణ మంజూరు చేయడానికి అయ్యే ఖర్చుల వివరాలను రుణ గ్రహీతకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీరేటు, ఇతర చార్జీల వివరాలు ఉండాలి. ఫలితంగా రుణ గ్రహీత తాను తీసుకునే రుణానికి వడ్డించే వడ్డీ, ఇతర ఖర్చుల వివరాలు తెలుసుకోవడం తేలికవుతుంది.
రుణం తీసుకున్న రుణ గ్రహీత వాయిదాల్లో చెల్లించాల్సిందే. కొంత ఫీజుతో ముందస్తు చెల్లింపులు చేసే చాన్స్ ఉంటుంది. కానీ కొత్త రూల్స్ ప్రకారం నిర్ణీత గడువులోగా డిజిటల్ రుణం పేమెంట్ చేయొచ్చు. ఈ సమయంలో వడ్డీ మాత్రమే చెల్లిస్తే చాలు.. మిగతా చార్జీలు విధించడానికి కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనను డిజిటల్ రుణాల మంజూరుకే బ్యాంకుల బోర్డులు అమలు చేస్తాయా.. ఇతర అప్పులకూ వర్తింపజేస్తాయా చూడాల్సి ఉంది.
కరోనా వేళ ఆన్లైన్ లోన్ యాప్ సంస్థలు రుణ గ్రహీతలకు రుణాలిస్తూనే సదరు రుణ గ్రహీత ఫోన్ లిస్ట్లో ఫోన్ నంబర్లు, కాల్స్ లిస్ట్ సేకరించకూడదన్న నిబంధననూ ఆర్బీఐ తీసుకొచ్చింది. వచ్చే 25 ఏండ్ల కాలంలో ఫిన్టెక్ రంగంలో పలు విప్లవాత్మక మార్పులు వస్తాయని, వినియోగదారులకు ఉపకరిస్తాయని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్ శెట్టి పేర్కొన్నారు.