స్వతంత్ర భారతం వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ.. మువ్వన్నెల పతాకానికి సగర్వంగా వందన సమర్పణ జరిపే సమయాన.. భారతీయులంతా ఒకే యూనిఫామ్ ధరిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు కార్యరూపమే ‘చర్ఖా’. పంద్రాగస్టు మాత్రమేనా? గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి తదితర ప్రత్యేక సందర్భాలకు ఏకరూప దుస్తులు రూపొందిస్తున్నారు ‘చర్ఖా’ స్టార్టప్ వ్యవస్థాపకురాలు ప్రతిమ రాపర్తి.
స్వతంత్ర ఉద్యమంలో విదేశీ వస్ర్తాలను బహిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు మన పెద్దలు. ఆ త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తదితర వేడుకల్లో జాతి సమైక్యతను చాటడానికి ఓ ప్రత్యేక యూనిఫామ్ తయారుచేశారు హైదరాబాద్కు చెందిన ప్రతిమ. ఇందుకోసం ఆమె చేనేతను ఎంచుకున్నారు. వాటికి మువ్వన్నెల బార్డర్ను అందంగా డిజైన్ చేసి, ముచ్చటైన యూనిఫామ్లను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో జాతీయ పండుగకు ఓ డ్రెస్కోడ్ పరిచయం చేస్తున్నారు ప్రతిమ.
దేశభక్తి నుంచి…
ప్రతిమ రాపర్తి హన్మకొండలో పుట్టారు. సిరిసిల్లలో పెరిగారు. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నారు. ఆర్కిటెక్చర్లో డిప్లొమా తర్వాత, ఉద్యోగం చేస్తూనే వారసత్వంగా వస్తున్న ఆఫీస్ స్టేషనరీ బిజినెస్ చూసుకున్నారు. పంద్రాగస్టు తనకు ఇష్టమైన జాతీయ వేడుక. జెండావందనం చేస్తూ ఉద్వేగానికి గురైన క్షణాలు అనేకం. పెరిగిన వాతావరణం, అమ్మమ్మ, తాతయ్య నేర్పించిన సూక్తులు, గురువులు బోధించిన విలువలు.. ఆమెలో దేశభక్తిని పెంపొందించాయి. ఆ ప్రేరణతోనే ప్రత్యేక సందర్భాల్లో భారతీయులు ధరించేందుకు ఓ యూనిఫామ్ డిజైన్ చేయాలన్న ఆలోచన వచ్చింది. పట్టుతో నేసిన వస్ర్తాలకు మువ్వన్నెల రంగులతో బార్డర్ ఇచ్చి, ధర్మచక్రం స్థానంలో భారతీయ సంస్కృతిలో భాగమైన 24 చుక్కల ముగ్గును ఇమిడ్చి.. అందంగా ఓ డ్రెస్ డిజైన్ చేశారు. ఏకరూప దుస్తుల వల్ల ప్రజల్లో ఏకత్వ భావన కలుగుతుందని ఆమె ఆలోచన. ఆ లక్ష్యంతోనే.. 2018, డిసెంబర్ 30న ‘చర్ఖా’ స్టార్టప్ ప్రారంభమైంది. ఆమె ప్రయత్నాన్ని చాలామంది విమర్శించారు. పెట్టుబడి దండగని పెదవి విరిచారు. కానీ ప్రతిమ వెనుకడుగు వేయలేదు. తన ఆలోచనపై నమ్మకంతో బ్యాంకులను సంప్రదించి మూడు లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఎగ్జిబిషన్లు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచారు. ఆన్లైన్ విక్రయాల కోసం charkha.online పేరుతో వెబ్సైట్ను సృష్టించారు. తానే మోడల్గా మారారు. చీరలు, ధోతీలు ముస్తాబు చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ‘హ్యాండ్లూమ్ డే’ సందర్భంగా ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకూ పీపుల్స్ ప్లాజాలో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. ‘ఈ కష్టమంతా సంపాదన కోసం కాదు, సమాజం కోసం’ అంటారు ప్రతిమ. సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారం సేవ లాంటిదే.
అవరోధాలు అధిగమిస్తా
నా ప్రయత్నాన్ని వీహబ్ దృష్టికి తీసుకెళ్లాను. నా ఆలోచనను మెచ్చుకున్నారు. వీహబ్లో రిజిస్టర్ అయిన తర్వాత లాంచ్ప్యాడ్ ఈవెంట్కు ఎంపిక చేశారు. అక్కడ ఇన్వెస్టర్లకు నా కార్యాచరణ ప్రణాళిక వివరంగా చెప్పాను. కానీ ఎందుకో నిధులు రాబట్టలేకపోయాను. అయినా నా ప్రయత్నం మానుకోలేదు. సొంతంగా పెట్టుబడి పెట్టి రంగంలోకి దిగాను. ఆ లాభాలను మళ్లీ తయారీకే ఉపయోగించి స్టార్టప్ను ముందుకు తీసుకెళ్తున్నాను. నా ప్రయాణంలో వీహబ్ సహకారం మరువలేనిది.
– ప్రతిమ రాపర్తి
సీయీవో, చర్ఖా
– రవికుమార్ తోటపల్లి