బాలీవుడ్ (Bollywood)తోపాటు దాదాపు అన్నిసినీ పరిశ్రమల్లో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్పలోని ఊ అంటావా ఊఊ అంటావా (Oo Antava) పాటకు నృత్య రీతులు సమకూర్చాడు. గణేశ్ ఆచార్య తనను వెంబడిస్తూ..లైంగికంగా వేధించారని ఆయన కో డ్యాన్సర్ 2020లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఇదే కేసులో ముంబై పోలీసులు ఛార్జీ షీటు ఫైల్ చేశారని బీటౌన్ వర్గాల సమాచారం.
ఒషివారా పోలీస్ స్టేషన్ ( Oshiwara Police station) పరిధిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లో ఛార్జీషీటు దాఖలైంది. గణేశ్ ఆచార్యపై ఐపీసీ సెక్షన్ 354-ఏ, 354 సీ, 354డీ, 509, 323, 504, 506కి కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై మాట్లాడేందుకు గణేశ్ ఆచార్య విముఖత వ్యక్తంచేశాడు. ఆయన తరపు లాయర్ రవి సూర్యవంశి మాట్లాడుతూ..ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులు బెయిల్ వచ్చేవేనన్నారు.
కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులను తాను తిరస్కరించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో డ్యాన్సర్ పేర్కొంది. గణేష్ ఆచార్య తనను వేధించాడని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, తనకు అశ్లీల కంటెంట్ను కూడా చూపించాడని ఆరోపించింది. అంతేకాదు తాను ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఫిజికల్ రిలేషన్ కొనసాగించాలని ఒత్తిడి చేశాడని ఆరోపణలు చేసింది.
గణేశ్ ఆచార్య మహిళా అసిస్టెంట్లు నన్ను కొట్టారు..నాపై దుర్భాషలాడి..పరువు తీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు న్యాయవాదిని సంప్రదించానని బాధిత మహిళ పేర్కొంది.