షిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. చండీగఢ్ – మనాలి జాతీయ రహదారిపై ఏడో మైలురాయి వద్ద రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ వాహనం సైతం దెబ్బతిన్నది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అలాగే ప్రత్యామ్నాయ కమాండ్ బజౌర్ రహదారితో పాటు జిల్లావ్యాప్తంగా 50 రోడ్లు మూతపడ్డాయి. సర్కాఘాట్-ధరంపూర్ ఎన్హెచ్పై వాహనాల కదలికలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు ఉప్పొంగడంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. రహదారుల మూసివేత మండి డీఎం ధ్రువీకరించారు.
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పాలంపూర్-సుజన్పూర్ రహదారి మూసివేశారు. మరోవైపు, బియాస్ వంతెన సమీపంలో కొండచరియలు పడిపోవడంతో డెహ్రా-హోషియార్పూర్ (ఎన్హెచ్-503) మూతపడింది. గత రెండు మూడు గంటలుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పాలంపూర్లో కుండపోత వర్షాలతో పాలంపూర్ – ధర్మశాల మార్గంలో వాహనాలు నిలిపివేగా.. ఉదయం 4 గంటల నుంచి ట్రాఫిక్ ప్రభావితమైంది.