బేగంపేట, మే 5: హీమోఫీలియా..ఇదో అరుదైన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారిలో చిన్నపాటి దెబ్బ తగిలినా రక్తస్రావం ఆగదు. వీరికి అనుకోకుండా ఏదైనా ఆపరేషన్ నిర్వహించాలంటే చాలా కష్టం. ఈ వ్యాధి సోకిన మాజీ సైనికాధికారి భార్యకు గర్భాశయ క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు కిమ్స్ దవాఖాన వైద్యులు. దీనికి సంబంధించి వివరాలను గురువారం కిమ్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర వెల్లడించారు. ‘నగరానికి చెందిన మాజీ సైనికాధికారి భార్య సావిత్రి (58)కి హీమోఫీలియా ఉంది. గతంలో ప్రసవ సమయంలో మూడురోజులపాటు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అప్పట్లో మృత్యువుతో పోరాడి విజయం సాధించింది. తాజాగా గర్భాశయ క్యాన్సర్ సోకడంతో శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ఎవరూ సాహసించలేదు. ఆస్పత్రి వైద్యుల సహకారంతో రోబొటిక్ సర్జరీ ద్వారా తక్కువ రక్తస్రావంతో చికిత్స నిర్వహించాం. ఐసీయూలో వారంపాటు పర్యవేక్షించి పూర్తిగా నయం చేశాం’ అని ఆమె పేర్కొన్నారు.